శాసనసభలో వైసీపీ పార్టీ కి భారీ మెజారిటీ ఉండడంతో జగన్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లు సులభంగా ఆమోదముద్ర పొందినది. కానీ ఈ బిల్లుకు శాసనమండలిలో ప్రవేశపెట్టగానే అక్కడ జగన్ సర్కార్ కు తగిన మెజార్టీ లేకపోవడంతో టీడీపీ ఎమ్మెల్సీలు అందరూ వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లును వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీల మెజార్టీ ఎక్కువ ఉండడంతో... టిడిపి ఎమ్మెల్సీలందరూ వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని నిర్ణయం తీసుకోవడంతో శాసనమండలి చైర్మన్ షరీఫ్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు తీర్మానం ఇచ్చారు. పాలన వికేంద్రీకరణ సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపాలని శాసనమండలి చైర్మన్ నిర్ణయించినప్పటికీ బిల్లులు మాత్రం సెలెక్ట్ కమిటీ ముందుకు వెళ్లలేదు అంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సిఆర్డిఏ చట్టం రద్దు, సహా పాలన వికేంద్రీకరణ కు సంబంధించిన బిల్లు సెలెక్ట్ కమిటీ ముందుకు ఇంకా వెళ్ళలేదు అంటూ వస్తున్న వార్తలపై స్పందించారు శాసనమండలి చైర్మన్ షరీఫ్. వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటీ వద్దకు వెళ్ళలేదు అని వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని స్పష్టం చేశారు. సీఆర్డీఏ రద్దుతో పాటు పాలనా వికేంద్రీకరణ కు సంబంధించిన రెండు బిల్లులు ఇప్పటికే సెలెక్ట్ కమిటీ ముందుకు వెళ్లాయి అంటూ శాసనమండలి చైర్మన్ షరీఫ్ స్పష్టం చేశారు. కాగా ఈ బిల్లులపై సెలెక్ట్ కమిటీ తదుపరి ప్రక్రియ చేయాల్సి ఉంది అంటూ వివరణ ఇచ్చారు శాసనమండలి చైర్మన్.
ఇక మిగిలి ఉంది సెలెక్ట్ కమిటీ సభ్యుల ఎంపిక మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే వికేంద్రీకరణ కు సంబంధించిన బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి శాసన మండలి రద్దుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈనెల 27న క్యాబినెట్ తో భేటీ అనంతరం శాసన మండలి రద్దు కు సంబంధించిన తీర్మానంపై జగన్మోహన్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.