కారు జోరు మున్సిపల్ ఎన్నికల్లో కొనసాగుతోంది. ఉత్తర తెలంగాణలో కీలకమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికార పార్టీ హవా సాగుతోంది. జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లోనూ గులాబీ గుబాళించబోతున్నదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతుండగా ఇప్పటికే పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో కారు జోరు సాగింది. 15 వార్డులున్న ధర్మపురిలో 8 వార్డులను టీఆర్ఎస్ గెలుచుకుంది. చైర్మన్ పీఠం కైవసం చేసుకుంది. ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతు లేకుండానే టీఆర్ఎస్ బల్దియాలో అధికారాన్ని దక్కించుకోనుంది.
కాగా, ధర్మపురి నుంచి రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీఆర్ఎస్ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల నేపథ్యంలో ప్రజలు మరోసారి టీఆర్ఎస్కే పట్టం గట్టారంటున్నారు. వృద్ధాప్య పింఛన్లు, షాదీముబారక్, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్లు, వికలాంగ పింఛన్లు, ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపాయంటున్నారు. లబ్ధిదారులు, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు కారు గుర్తుకే ఓటేశారంటున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇచ్చిన ఓటర్లు టీఆర్ఎస్కు ఓటు వేశారని పేర్కొంటున్నారు.
ఇదిలాఉండగా, జగిత్యాల జిల్లా పరిధిలోని జగిత్యాలలో 48 వార్డులకు, కోరుట్లలో 33, మెట్పల్లిలో 26, ధర్మపురిలో 15, రాయికల్లో 12వార్డులకు ఎన్నికలు జరిగాయి. కోరు ట్ల మున్సిపాలిటీలో మూడు, మెట్పల్లిలో ఒక వార్డు ఏకగ్రీవం కావడంతో 130వార్డులకు బుధవారం ఎన్నికలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా సగటున 72.71 శాతం పోలింగ్ నమోదైంది. ఐదు మున్సిపాలిటీల పరిధిలో సగటున 70 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత అన్ని పార్టీల కీలక నాయకులు, అభ్యర్థులు, పోలింగ్ సరళిని బట్టి గెలుపు ఓటములను బేరీజు వేసుకున్నారు. అరవై సంవత్సరాలుగా మున్సిపాలిటీలో అధికార పార్టీగా చక్రం తిప్పిన కాంగ్రెస్, ఈ సారి తీవ్రంగా దెబ్బతింటుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. టీఆర్ఎస్ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల నేపథ్యంలో ప్రజలు మరోసారి టీఆర్ఎస్కే పట్టం గట్టారంటున్నారు.