ఊహించిందే జరిగింది... పరకాలలో మున్సిపల్ ఎన్నికలు ఏకపక్షంగానే జరిగాయని టీఆర్ఎస్ శ్రేణులు చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. పట్టణంలో 22వార్డుల్లో ఇప్పటికే 11వార్డుల్లో టీఆర్ఎస్ సభ్యులు ఏకగ్రీవం అయ్యారు. ఎన్నికలు జరిగిన మిగిలిన స్థానాల్లో కూడా ప్రజల మద్దతు టీఆర్ఎస్కే ఉండడంతో ప్రతిపక్ష పార్టీలకు మింగుడు పడలేదు. ప్రధానంగా కొండా దంపతులకు పరకాల ఓటర్ల ఘోర సత్కారం చేశారని టాక్ జరుగుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలు ఆ పార్టీ అభ్యర్థులకే మద్దతు దక్కినట్లు విశ్లేషిస్తున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టణంలో 81.90 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. పరకాల పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకు అంటూ... పలు పార్టీల నాయకులు ఇప్పటికే టీఆర్ఎస్తో కలిసి వచ్చారు. దీంతో పరకాలలో అసలు ఎన్నికలకు ముందే 11 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. అదే సమయంలో ప్రతి పక్ష పార్టీలకు కనీసం పోటీ చేసేందుకు కూడా అభ్యర్థులు కరువైన పరిస్థితులు ఎదురయ్యాయి. చివరకు అక్కడ ఫలితాల్లో కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా రాలేదు. పరకాలను అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలిపారని టీఆర్ఎస్ శ్రేణులు పేర్కొంటున్నారు.
మున్సిపల్ ఎన్నికల నోటిపికేషన్ విడుదల అయిన దగ్గరి నుంచి పోలింగ్ ముగిసే వరకు టీఆర్ఎస్ హవా కొనసాగింది. పట్టణంలో ఏకగ్రీవమైన 11వార్డుల్లో ప్రతిపక్ష పార్టీలు కనుమరుగు కాగా.. మిగిలిన 11స్థానాల్లో కాంగ్రెస్ ఒక్క స్థానం, బీజేపీ ఒక్క స్థానంలో మాత్రమే పోటీ ఇవ్వగా.. మరో రెండు స్థానాల్లో టీఆర్ఎస్ రెబల్స్ పోటీ ఇచ్చారు. మిగిలిన అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్లారు. వారం రోజులపాటు జరిగిన జరిగిన ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోడంతో వన్సైడ్ పోలింగ్ జరిగింది. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పట్టణంలో అర్హ్హులైనప్రతి ఒక్కరికి ప్రభూత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు కనీసం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.
కాగా, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఈ గెలుపుపై స్పందిస్తూ, టీఆర్ఎస్పై నమ్మకం ఉంచి పరకాల మున్సిపాలిటీలో మరోసారి అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు అని తెలిపారు. `ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రంలోనే పరకాల పట్టణాన్ని మోడల్గా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషి చేస్తా. ` అని ప్రకటించారు.