మున్సిపల్ ఎన్నికల సమయంలో తెరాస పార్టీ దూసుకుపోతున్నది. దాదాపుగా 90కి పైగా స్థానాలు గెలుచుకున్నప్పటికీ కొన్ని చోట్ల మాత్రం పరాభవం తప్పలేదు. అన్ని మున్సిపాలిటీలో పోటాపోటీగా అభ్యర్థులు పోటీ చేసి తెరాస పార్టీ సఫలం అయ్యింది. ఈ ఎన్నికలను పూర్తిగా మంత్రులకు వదిలేశారు కెసిఆర్. అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆ మంత్రులదే. మంత్రులు చాలా వరకు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించారు. డబ్బు ప్రభావమా, ఇంకేమిటా అన్నది పక్కన పెడదాం.
ఈ ఎన్నికల్లో అందరూ ప్రభావం చూపినా ఒక్క సబితా మాత్రం డీలా పడింది. ఆమె నియోజక వర్గంలోని మున్సిపాలిటీలో అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. ఇది ఆమెకు కొంత ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పాలి. సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గం పరిధిలోనికి మీర్ పేట కార్పొరేషన్లో 8 మంది ఇండిపెండెంట్లు గెలవడం ఇబ్బందికరంగా మారింది.
అధికారంలో ఉన్న తెరాస పార్టీ 19 డివిజన్లు గెలుచుకున్న, బీజేపీ చోట్ల విజయం సాధించడం ఆ పార్టీని కలవర పెడుతున్నది. అలానే కాంగ్రెస్ 3 చోట్ల విజయం సాధించారు. ఇక్కడ ఆ 8 మంది ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు. వీరు ఎవరివైపు మొగ్గు చూపితే వారిదే విజయం కావొచ్చు. దీంతో పాటుగా బడంగ్ పేట లో తెరాస విజయం సాధించింది. ఇది కొంత ఊరట కలిగించే అంశం అయినప్పటికీ, తెరాస పార్టీకి పెద్దగా మెజారిటీ రాలేదు. బీజేపీ అభ్యర్థులు గట్టిపోటీ ఇచ్చారు.
అటు జల్ పల్లిలో ఎంఐఎం అభ్యర్థులు విజయం సాధించడంతో తెరాస పార్టీ ఆందోళన చెందుతోంది. జల్ పల్లి మున్సిపాలిటీని ఎంఐఎం కైవసం చేసుకుంది. కాగా, తుక్కుగూడ మున్సిపాలిటీలో బీజేపీ విజయం సాధించింది. ఈ ఫలితాలు సబితా ఇంద్రారెడ్డి పదవిపై ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి. ఆమెపై చర్యలు తప్పవని అంటున్నారు పార్టీ నేతలు. నిజంగానే ఆమెపై పార్టీ చర్యలు తీసుకుంటుందా లేదంటే వార్నింగ్ ఇచ్చి వదిలేస్తుందా చూడాలి.