ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ స‌ర్కారుకు ఊహించ‌ని షాక్ ఇది. గ‌తంలో ఏ స‌ర్కారు ఎదుర్కోనంత ఇబ్బందిని ఎదుర్కుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) కార్పొరేట్‌, ఆదాయ పన్ను వసూళ్లు భారీగా తగ్గనున్నాయి. గత రెండు దశాబ్దాల్లో తొలిసారి అంతకుముందు ఏడాదితో పోల్చితే ప్రస్తుత ఏడాది తక్కువగా నమోదయ్యేలా కనిపిస్తున్నాయి. దేశ వృద్ధిరేటు (జీడీపీ) గణనీయంగా పడిపోవడం, కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ పన్ను రేట్లను తగ్గించడం ఇందుకు ప్రధాన కారణమని పలువురు సీనియర్‌ అధికారులు పేర్కొంటున్నారు.

 


2019-20లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ.13.5 లక్షల కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో జరిగిన వసూళ్ల కంటే ఇది 17 శాతం ఎక్కువ. అయితే ఈ నెల 23 నాటికి పన్నుల విభాగం రూ.7.3 లక్షల కోట్లు మాత్రమే వసూలు చేయగలిగిందని, ఇది గతేడాది ఇదే కాలం నాటికి జరిగిన వసూళ్ల కంటే 5.5 శాతం ఎక్కువని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో డిమాండ్‌ గణనీయంగా తగ్గి వ్యాపార రంగం కుదేలవడంతో పలు కంపెనీలు తమ పెట్టుబడులు, ఉద్యోగాల్లో కోత విధించాయి. దీంతో పన్ను వసూళ్లు క్షీణించాయి. ఈసారి దేశ జీడీపీని 11 ఏండ్ల కనిష్ఠ స్థాయిలో 5 శాతంగానే కేంద్రం అంచనా వేస్తుండటం కూడా పన్ను వసూళ్ల మందగమనాన్ని ప్రతిబింబిస్తోంది. 

 

 

తొలి మూడు త్రైమాసికాల్లో కంపెనీల నుంచి అడ్వాన్స్‌ పన్నులను వసూలు చేసిన తర్వాత అధికారులు చివరి మూడు నెలల్లో ఎంతగా ప్రయత్నించినప్పటికీ మిగతా వార్షిక ప్రత్యక్ష పన్నుల్లో 30-35 శాతానికి మించి చేయలేకపోతున్నట్టు గత మూడేళ్ల‌ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రత్యక్ష పన్నుల వసూళ్లకు ఈ ఏడాది కూడా తాము ఎంత గట్టిగా కృషిచేసినప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో వసూలైన రూ.11.5 లక్షల కోట్ల కంటే దాదాపు 10 శాతం తక్కువగా ఉంటాయని ఎనిమిది మంది సీనియర్‌ అధికారులు పేర్కొన్నారు. సాధారణంగా ప్రభుత్వానికి వచ్చే వార్షిక ఆదాయంలో ప్రత్యక్ష పన్నుల వాటా దాదాపు 80 శాతం మేరకు ఉంటుంది. ఈ పన్ను వసూళ్లు తగ్గితే ఖర్చులను అధిగమించేందుకు ప్రభుత్వం భారీగా రుణాలను స్వీకరించాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: