రికార్డు సమయం పాటు కొనసాగిన తెలంగాణ ఆర్టీసీ సమ్మె అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ వారితో సమావేశమై పలు హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలోనే ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికులను భద్రంగా గమ్యస్థానాలకు చేరుస్తున్న టీఎస్ ఆర్టీసీ.. అంతే భద్రంగా, వేగంగా, నాణ్యమైన కార్గో సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఆర్టీసీని నష్టాల బాట నుంచి లాభాల బాటలోకి నడిపేందుకు సీఎం కేసీఆర్ కార్గో సేవలను ప్రారంభించాలని నిర్ణయించడంతో దీని కార్యాచరణను అధికారులు ముమ్మరం చేశారు.
కార్గో సేవలతో దేశానికే రోల్ మోడల్గా నిలువాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన నేపథ్యంలో అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. 9, 10 నెలల్లో పూర్తిస్థాయిలో కార్గో సేవల విభాగం ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నారు. ‘వేగంగా.. భద్రంగా.. మీకు చేరువగా’ అనే ట్యాగ్లైన్తో కార్గో సేవల లోగో రూపొందించారు. ఇందుకోసం 30 బస్సులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన అధికారులు.. ఈ నెల 27న ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 822 కార్గో బస్సులు, 1,210 మంది సిబ్బంది, 15 మంది అధికారులు ఉండాలని నిర్ణయించారు. 29డిపోలకు 29 బస్సులను అందిస్తూ సర్దుబాటు చేయనున్నా రు. హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమై రాష్ట్రమంతటా సేవలందించనున్నాయి. ఒక్కో కార్గో ట్రాన్స్పోర్టు వెహికిల్ (సీటీవీ)కి 1.3 డ్రైవర్లు అవసరమని గుర్తించారు. 112కండక్టర్లుగా ఉన్నవారిలో ఉన్నత చదువులు చదివిన 112 మందిని మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్గా ఎంపికచేసి శిక్షణ కూడా అందించారు. కార్గో సేవల పర్యవేక్షణకు ఇద్దరు ఉన్నతాధికారులను నియమిస్తున్నారు.
కాగా, ఆర్టీసీ తమ సేవలు పొందే వాటి గురించి ఆరా తీస్తోంది. ఒక్క పౌరసరఫరాలశాఖలో ధాన్యం సరఫరాకే ఏటా రూ.300 కోట్లకుపైగా వ్యయం అవుతుండగా.. వ్యవసాయం, బేవరేజెస్ కార్పొరేషన్ కలుపుకొంటే రూ.500 నుంచి 600 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నాయి. విద్య, వైద్యం, సంక్షేమశాఖ, మార్కెంటింగ్.. ఇలా అన్ని శాఖల ఆర్డర్లు ఆర్టీసీ కార్గోకు బదిలీ అయితే సంస్థకు పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి.