తెలంగాణలోని ప్రతిపక్షాలు ఎన్నిక ఏదైనా...పరాజయం కోసమే సిద్ధపడే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. ఎన్నికలేవైనా విజయం తమదేనని అధికార టీఆర్ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తుండగా...ఆయా ఎన్నికల ఫలితాలు అదే రీతిలో వస్తున్నాయి. రాష్ట్రంలో ఈ నెల 22న 120 మున్సిపాలిటీలు, 9 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఆధిపత్యానికి గండికొడుతామని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రకటించినప్పటికీ ఆ మేరకు ఫలితాలు రాలేదు. గులాబీ జోరు కొనసాగింది. దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు ఓటమికే సిద్ధమైన పరిస్థితి ఉందని అంటున్నారు.
రికార్డు స్థాయి విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ అదే ఊపును గత ఎన్నికల విజయం ఊపునే కొనసాగించింది. గత ఏడాది మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ జాతీయస్థాయి రికార్డు నమోదు చేసింది. 2016లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 150 వార్డులకు, టీఆర్ఎస్ 99 స్థానాలు, మిత్రపక్ష ఎంఐఎం 44 స్థానాలు దక్కించుకున్నాయి. కాం గ్రెస్ 2 స్థానాలు, బీజేపీ 4, టీడీపీ 1 స్థానం సాధించాయి. జీహెచ్ఎంసీ చరిత్రలో ఇన్ని స్థానాలు, పొత్తు లేకుండానే మేయర్ స్థానం దక్కించుకోవడం తొలిసారి అని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి తీసుకున్న మరో సంచలన నిర్ణయం ముందస్తు ఎన్నికలు. 2018 డిసెంబర్లో 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ఏకపక్ష విజయం సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ 46.87శాతం ఓట్లు సాధించి 88 స్థానా లు దక్కించుకున్నది. కాంగ్రెస్ 28.43 శాతం ఓట్లు పొంది, 19 స్థానాలు గెలుచుకున్నది. బీజేపీ 6.98 శాతం ఓట్లు మాత్రమే పొంది ఒక్క సీటుకే పరిమితమైంది. ఎంఐఎం 2.71 శాతం ఓట్లు పొంది 7 స్థానాలు గెలుచుకుంది. అనంతరం, 2019 పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నరేంద్రమోదీ హవా, బీజేపీ ప్రభావం కనిపించినా తెలంగాణలో టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగింది. 17 లోక్సభ స్థానాల్లో టీఆర్ఎస్ 41.71 శాతం ఓట్లు సాధించి 9 స్థానాలు గెలుచుకున్నది. కాంగ్రెస్ 29.79 శాతం ఓట్లతో 3 స్థానాలు, బీజేపీ 19.65 శాతం ఓట్లతో 4 స్థానాలు, ఎంఐఎం 2.8 శాతం ఓట్లతో ఒక సీటు గెలిచింది.
ఇక గత ఏడాది జరిగిన దేశంలో మరే పార్టీకి సాధ్యం కాని రీతిలో మొత్తం 32 జెడ్పీ చైర్మన్ పదవులను దక్కించుకుంది. 537 జెడ్పీటీసీ స్థానాల కు ఎన్నికలు జరిగితే, టీఆర్ఎస్ 448 స్థానాలు (83.42 శాతం), కాంగ్రెస్ 75 (13.96 శాతం), బీజేపీ 8 స్థానాలు (0.14 శాతం) దక్కించుకోగలిగాయి. 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా, టీఆర్ఎస్ 3,556 స్థానాలు (61.13), కాంగ్రెస్ 1,377 (23.67 శాతం), బీజేపీ 211 (3.62 శాతం) గెలుచుకున్నాయి. మొత్తం 537 ఎంపీపీ పదవులకు, టీఆర్ఎస్ 431, కాంగ్రెస్ 72, బీజేపీ 6 చోట్ల గెలిచారు.