రెండు నెలల్లో.. అంటే రెండే నెలల్లో కర్నూల్ కు విమానాశ్రయం రానుంది.. ఈ విషయాన్నీ స్వయానా ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వల్లవన్ తెలిపారు. విమానాశ్రయ పనుల త్వరితగతిన పూర్తి చేసి రెండు నెలల్లో విమానాల రాకపోకలు ప్రారంభిస్తామని కారికల వల్లవన్ నిన్న మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.
నిన్న శనివారం.. ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ఏవీయేషన్ డైరెక్టర్ అడ్వయిజర్ భరత్రెడ్డితో కలిసి ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వల్లవన్ పరిశీలించారు. ప్రత్యేక హెలికాప్టర్లో కడప నుండి ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న వీరికి ఎయిర్పోర్టు అధికారులు, సీఈవో నినాశర్మ, ఏపీడీ కైలాష్ మండల్, సీఎస్వో జయప్రకాష్, సేఫ్టీ మేనేజర్ విద్యాసాగర్ స్వాగతం పలికారు.
అధికారులతో పాటు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి విమానాశ్రయం పనులను పరిశీలించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆమె మీడియాతో మాట్లాడుతూ ఓ గుడ్ న్యూస్ చెప్పారు.. అది ఏంటి అంటే.. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విమానాశ్రయాన్ని పరిశీలించామని, విమానాశ్రయం పనులు ఇప్పటికే 60 శాతం పూర్తయ్యాయని, మరో 40 శాతం పనులు జరగాల్సి ఉందని తెలిపారు.
కాగా.. రెండు నెలల్లోనే పనులు పూర్తి చేసి విమానాల రాకపోకలు ప్రారంభిస్తామని ఆమె చెప్పారు. అయితే రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ కింద ఎయిర్పోర్టును గుర్తించినట్టు, దాని ద్వారా నిర్వహణ వ్యయం తగ్గుతుందని ఆమె తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయానికి నిధులు విడుదల చేస్తుందని ఆమె చెప్పారు.
కాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే నిధుల ద్వారా ఈ విమానాశ్రయం ద్వారా ఇండస్ట్రియల్ హబ్, ఎయిర్పోర్టు సిటీ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు ఆమె చెప్పారు. ఏవియేషన్ అకాడమీ... పైలట్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేసి శిక్షణా తరగతులు నిర్వహిస్తామని ఆమె తెలిపారు. అంటే.. త్వరలోనే ఇక కర్నూల్ లో కూడా ఏవియేషన్ స్టూడెంట్స్ ఉంటారు అన్నమాట!