జనసేన పార్టీలో అసంతృప్తులు ఇంకా చల్లారలేదు. పార్టీని నమ్ముకుని ఎన్నో ఆశలతో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన వారంతా పవన్ వ్యవహారశైలి కారణంగా, ఆ పార్టీ క్షేత్రస్థాయిలో బల పడకపోవడం వంటి కారణాలతో పాటు, నిలకడలేని అధినేత వైఖరి కారణంగా ఆ పార్టీ నాయకులు చాలా ఉంది పార్టీకి దూరమయ్యారు. ఇంకా పార్టీలో ఉన్న కొంతమంది అసంతృప్తిగానే కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పుడు ఆ వరుసలో ముందున్న వ్యక్తి గా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కనిపిస్తున్నారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా గతంలో ఏపీలో పనిచేసిన లక్ష్మీనారాయణ ప్రజల్లో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఆ తరువాత ఆయన మళ్లీ మహారాష్ట్ర క్యాడర్ కు  బదిలీ అవ్వడం, అక్కడి నుంచి ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగిపోయాయి.

 

 ఇక సొంతంగా ఆయన పార్టీ పెట్టబోతున్నారు అని ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. కానీ ఎవరి ఊహకు అందకుండా ఆయన జనసేన పార్టీలో చేరారు. విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేశారు. అంతేకాకుండా రూ 100 బాండ్ పేపర్ పై తన హామీలను ప్రింట్ చేయించి మరి నియోజకవర్గ ప్రజలకు పంచి పెట్టారు. తాను గెలిస్తే నిత్యం ప్రజల మధ్యే ఉంటానని చెబుతూ పేదలకు అండగా ప్రశ్నించే గొంతుక అవుతాను అంటూ భరోసా ఇచ్చారు. అయినా ఆయనకి విశాఖలో ఓటమి తప్పలేదు. జనసేన పార్టీ విశాఖ సీటు ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అని భావించిన వారు అంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఆయన ఎంపీగా పోటీ చేసి మూడో స్థానంలో కి పరిమితం కావడంతో ఆయన చాలా కాలం ఆ బాధ నుంచి తేరుకోలేకపోయారు. 

 

నిత్యం ప్రజల్లోనే ఉంటూ ఏదో ఒక కార్యక్రమం చేస్తూ వస్తున్నారు. కానీ పార్టీ గురించి పెద్దగా పట్టించుకోవడం మానేశారు. ఈ నేపథ్యంలో పవన్ కు జేడీకి మధ్య రాజకీయ వైరం పెరిగిందని, ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ లక్ష్మీనారాయణ అలా చేయలేదు. పార్టీలోనే ఉండి లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల రాజధాని విషయంలో జనసేన పార్టీ యాక్టివ్ రోల్ పోషించినా జె.డి స్పందించలేదు. అయితే దీని వెనుక పార్టీ మీద ఉన్న అసంతృప్తి కారణం ఒకటైతే, విశాఖ రాజధానిగా వ్యతిరేకించడం వల్ల వ్యూహాత్మక తప్పిదం తాను చేసినట్లవుతుందని మౌనంగా ఉండిపోయారు. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని సంచలన విషయాలను బయటపెట్టారు. 

 

తాను రాజకీయాల్లోకి ఎన్నో ఊహించుకుని వచ్చానని, ఆ ఆశయాలను ప్రజల కోణాన్ని జనసేన పార్టీ గుర్తించలేకపోయిందని, అనవసర ప్రకటనలు, విమర్శలు చేయడం వల్ల కలిసి వచ్చేది ఏమీ లేదంటూ జనసేన ను ఉద్దేశించి మాట్లాడారు. అలాగే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం పై కనీసం ఒక్క మాట కూడా తనకు చెప్పలేదు అంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నంత సేపు ప్రజలకు ఏదైనా చేయాలని చూస్తున్నానని, జనసేనలో అది సాధ్యం కాదు అన్నట్టుగా జెడి వ్యాఖ్యానించారు. ఆయన మాటలను బట్టి చూస్తే త్వరలోనే ఆయనకు ఆయన జనసేనకు గుడ్ బాయ్ చెప్పేలా కనిపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: