గత కొంతకాలంగా ఏపీ రాజకీయాలు ఊహించని విధంగా మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా రాజధాని మార్పు అంశం ఏపీలో తీవ్ర కలకలం రేపింది. ఏపీ సీఎం తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగులు, అమలు చేయబోతున్న వ్యూహాలు ఎవరికి అర్థం కావడం లేదు. ఏపీలో మూడు రాజధానుల ఫార్ములా తెరపైకి రావడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కపడ్డారు. ప్రస్తుతం ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందా లేదా అన్న ప్రశ్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్నను మించి ఉత్కంఠను రెకెత్తిస్తుంది. అయితే దీని వెనక సీఎం జగన్ స్కెచ్ ఏంటా.. అని కొందరు ఆలోచనల్లో పడ్డారు.
ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానుల అంశం వెనుక ఒకే దెబ్బకు నాలుగు పార్టీలకు జగన్ చెక్ పెట్టే సుదీర్ఘ రాజకీయ వ్యూహమే దాగివుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవైపు ఏపీలో ఏం జరుగుతోందో అర్థంగాక టీడీపీ కార్యకర్తలు తలలుపట్టుకుంటున్నారు. ఇక రైతుల నుండి తీవ్రస్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతున్నా.. వైసీపీ ప్రభుత్వం ఏ మాత్రం వెనకడుగు వేయకుండా.. కమిటీల పేరుతో ముందుకెళ్తోంది. అయితే వాస్తవానికి ఏపీ విభజన సమయంలో కాంగ్రెస్, బిజెపి లు ఒకే మాట మీద సాగాయి. ఇక టిడిపి రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చి ముద్దాయిగానే ఉంటే.. పవన్ జనసేన సీన్లోకి రాలేదు.
అయితే ఒక్క వైసిపి మాత్రమే సమైక్య ఆంధ్రప్రదేశ్ కి నిలిచి తమకున్న తక్కువ బలంతోనే ఒకే వైఖరి తీసుకుని చివరివరకు నిలిచింది. ఇక ఆ తర్వాత ఏపీ పునర్విభజన జరిగిపోయింది. ప్రత్యేక హోదా, పోలవరం అంశాలే ప్రధాన ఎజండాగా 2014 నుంచి 2019 వరకు రాజకీయాలు సాగాయి. అయితే టిడిపి ప్రత్యేక ప్యాకేజ్ నినాదం ఎత్తుకుని ఎన్నికల ముందు యు టర్న్ తీసుకుని హోదా అంది. కాని, వైసీపీ మాత్రం పక్కా ప్లానింగ్తో హోదా కోసమే సింగిల్ ఎజెండాగా ఉద్యమించి ఎన్నికల్లో జనం మద్దతు సాధించింది. మరోవైపు పవన్ కూడా టీడీపీ వెంటే ఉండడంతో వీళ్లను జనం పక్కన పెట్టేసి జగన్ బాట పట్టారు.
అయితే విభజన రేపిన గాయాలకు రాజధాని ప్రధాన అంశంగా మారింది. ఏపీ రాజధాని నిర్మాణం పూర్తి కానంతకాలం విభజన సమస్యలు చుట్టుముట్టినంతకాలం కాంగ్రెస్, బిజెపి, టిడిపి, జనసేన దోషులుగా నిలిచే ఉంటారన్నది వైసిపి దీర్ఘకాలిక వ్యూహం రచించిందని అందుకే త్రి క్యాపిటల్ తో ఈ నాలుగు పార్టీలను కార్నర్ చేసే ఛాన్స్ దక్కుతుందని విశ్లేషకుల అంచనా వేశారు. మరి ఇదే నిజమైతే జగన్ స్కెచ్లు ఎంత వరకు సక్సెస్ అవుతాయో చూడాల్సి ఉంది.