ఒకప్పుడు పెళ్ళికి చాలా ప్రాధాన్యముండేది. పెళ్ళి, భార్యాభర్తల బంధమంటే ఎంతో భారతదేశంలో ఎంతో విలువుండేది. ప్రస్తుతం రోజుల్లో అవన్నీ ఏమీ లేవు మొత్తం జీవన శైలి అంతా మారిపోయింది. ఎవరికి నచ్చినట్లు వారు బ్రతుకుతున్నారు. భార్య భర్త అనే బంధానికి అర్ధం లేకుండా చేస్తున్నారు కొందరు. వివాహేతర సంబంధాలు హాయిగా దాంపత్య జీవితం గడపాల్సిన భార్యలు?.. భర్తలను దారుణంగా హతమారుస్తున్నాయి.. నిండునూరేళ్ల జీవితాన్ని కర్కశంగా కాటేస్తున్నాయి. విచక్షణా రహితంగా కూర్చున్న కొమ్మనే నరుకుంటున్నారు.. క్షణికావేశంలో చేసే తప్పుల వల్ల జీవితాలు పోతున్నాయి. చివరికి ఎవరికి కాకుండా కొందరు ఒంటరిగా కూడా మిగిలపోతున్నారు. దాని వల్ల వారికి పుట్టే పిల్లలకు తీరని లోటు జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు ఆలోచించడంలేదో నేటి తరం యువత అర్ధం కావడం లేదు. కుటుంబంలోని పిల్లలు, ముసలి తల్లిదండ్రులకు దూరమవుతున్నాయి.. ఏ ఆడపిల్లకైనా పెళ్లయిన తర్వాత భర్త తోడే లోకం. కానీ విచిత్రంగా కొందరు మహిళలు భర్తను వద్దు అనుకుంటున్నారు.
దాంతో భర్తలను అంతం చేస్తున్నారు.. ఒకపక్క బంగారం లాంటి భర్త, అంతకు మించిన బంగారం లాంటి పిల్లలు ఉన్నా క్షణిక సుఖం కోసం అడ్డదారులు తొక్కి భర్తలను మట్టు పెడుతున్నారు. స్వాతి, విద్య, జ్యోతి, అలాగే మొన్న హైదరాబాద్ బోయిన్ల్లికి చెందిన జహీదా, బోరబండకు చెందిన సంగీత.. ఇలా రోజు రోజుకు పెరిగిపోతున్న అక్రమసంబంధాలను చూసి సభ్య సమాజం సిగ్గు పడుతుంది.. తలదించుకుంటుంది.. వాట్సప్.. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రాం.. సామాజిక మాధ్యమం ఏదైనా వ్యక్తుల మధ్య దూరాన్ని తగ్గించి మరింత దగ్గర చేస్తున్నాయి… ఎంతగా దగ్గర చేస్తున్నాయంటే కాపురాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. వివాహేతర సంబంధాలతో భార్యను కడతేర్చే భర్తలు, ప్రియుడి కోసం భర్తను బండరాళ్ళతో మోదే భార్యలు ఎక్కువైపోతున్నారు. స్మార్ట్ ఫోన్లు వివాహేతర సంబంధాలకు వారధిగా మారుతున్నాయనీ, ఫలితంగా విచ్చలవిడిగా వివాహేత సంబంధాలు పెచ్చువిూరుతున్నాయని తాజాగా విడుదలైన సర్వే వెల్లడించింది. వివాహేతర సంబంధాల కారణంగా దేశంలో ప్రతి ఏటా మూడు వేల మంది హత్యకు గురౌతున్నారు.
గతంలో వివాహేతర సంబంధాలకు మహిళలు భయపడేవారు. కానీ ఇప్పుడు ఈ ‘బంధం’ పెంచుకోవడానికి ఎటువంటి జంకూ.. గొంకు ప్రదర్శించడం లేదని వెల్లడైంది. పైగా దానిని ఫ్రెండ్షిప్గా అభివర్ణించడం మామూలైపోయింది. వివాహమైన ప్రతి పదిమంది మగాళ్ళలో ముగ్గురు వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నట్లు వెల్లడైంది. ఇక మహిళల విషయాన్ని చూస్తే… పదిమంది మహిళకు ఇద్దరు మహిళలు వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నట్లు తేలింది. పైగా ఈ సంబంధాన్ని కలిగి ఉండటం వారు తప్పుగా భావించడం లేదు. పెళ్ళయిన పురుషులు/మహిళలు సాన్నిహిత్యం కారణంగా ఇటువంటి సంబంధాలు ఎక్కువవుతున్నాయనీ, స్నేహం పేరుతో అవతలి వ్యక్తిని ఏదోవిధంగా ఒప్పించి అక్రమ సంబంధాలకు పురిగొల్పుతున్నట్లు సర్వే వెల్లడించింది. ఇదిలా ఉంటే వివాహేతర సంబంధాలు.. హత్యలు సంచలనం కలిగిస్తున్నాయి.