చంద్రబాబు నాయుడు రాజకీయాల నుంచి తప్పుకునే సమయం ఆసన్నమైంది. ఎందుకంటే, బాబు ఇప్పుడు రాజకీయాల్లో ఉంది చేయాల్సింది ఏమి లేదు. ఇక ఆ పార్టీ ఇప్పట్లో కోలుకుంటుంది అని అనుకోవడానికి వీలు లేకుండా దెబ్బకొడుతున్నారు. ఇది ఆ పార్టీకి తీరని నష్టాన్ని కలిగిస్తోంది. తెలుగుదేశం పార్టీ సంఖ్యాబలం మండలిలో అధికంగా ఉన్నది. అందుకే ఇప్పుడు మండలిని రద్దు చేయాలనీ జగన్ నిర్ణయం తీసుకున్నారు.
ప్రలోభాలు పెట్టాల్సిన అవసరం లేదని, బేరసారాలు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదని, తనను చంద్రబాబులా తయారు చెయ్యొద్దని అన్నారు. మండలి రద్దుపై తీసుకున్న నిర్ణయం ఫైనల్ అని అంటున్నారు. మండలిని రద్దు చేయడం వలన వైకాపా ఇబ్బందులు పడుతుంది. అది వాస్తవమే అయినప్పటికీ కూడా మండలి వలన ఉపయోగం లేనప్పుడు పెట్టుకొని ఏం చేయాలి అని వైకాపా ఆరోపిస్తోంది. అందుకే మండలిని రద్దు చేయడానికే సిద్ధం అయ్యింది.
ఇకపోతే, మండలి విషయంలో గతంలో బాబు కూడా ఇలాంటి వ్యాఖ్యలు కొన్ని చేశారు. రామారావు రద్దు చేసిన తరువాత 2007 వైఎస్ రాజశేఖర్ రెడ్డి తిరిగి మండలిని తీసుకొస్తామని అంటే మండలి వలన సమయం వృధా డబ్బు వృధా అని, అవసరం లేనప్పుడు ఎందుకు తీసుకురావాలని అన్నారు. ఒకవేళ ఇప్పుడు తెచ్చినా తాము అధికారంలోకి వస్తే మండలిని తిరిగి రద్దు చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.
అలా కనుక బాబు 2014లో చేసి ఉంటె, ఇపుడు ఇన్ని తిప్పలు వచ్చేవి కాదు కదా. లోకేష్ ను రాజకీయాల్లోకి తీసుకు రావాల్సిన ఆవశ్యకత ఉండేది కాదు... ఇన్ని తిట్లు తినాల్సిన అవసరం కూడా ఉండదు. లోకేష్ కోసం మండలిని రద్దు చేసుకోకుండా ఉంచుకున్నారు. అంతేకాదు, ఆశావహులకు మండలిలో సీట్లు ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఆ మండలిలోని బలాన్ని అడ్డుగా పెట్టుకొని మూడు రాజధానులను అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇదే జగన్ కు ఇబ్బందిగా మారింది.