సంక్షోభాలు టీడీపీకి కొత్త కాదు. ఎన్నో చూశాం అన్నీ అధిగమిస్తాం. ఇది టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడు చెప్పే డైలాగులు. అయితే ఎప్పటి మాదిరిగా ఇప్పుడు పరిస్తితి లేదు. ఒక్కసారి పార్టీ సంక్షోభంలోకి వెళితే బయటపడటం చాలా కష్టమైపోతుంది. ఆ విషయం తెలంగాణలో టీడీపీ, మిగతా ప్రతిపక్షాలని చూస్తే అర్ధమవుతుంది. తెలంగాణలో ఎలాగో తుడిచిపెట్టుకోపోయిన టీడీపీ... ఇప్పుడు మూడు రాజధానుల దెబ్బకు ఏపీలో కూడా కొన్ని ప్రాంతాల్లో అడ్రెస్ లేకుండాపోయేలా కనిపిస్తుంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులని చూస్తే ఏపీలో టీడీపీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని అర్ధమవుతుంది. దానికి ఉదాహరణగా ఏపీలో చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీకి కంచుకోటగా ఉన్న కృష్ణా జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీని నడిపించే నాయకుడే లేడు. ఇందులో మొదట మాట్లాడాల్సింది. దివంగత ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహింఛిన గుడివాడ గురించి. మంత్రి కొడాలి నాని వైసీపీలోకి వెళ్ళిన దగ్గర నుంచి....ఇక్కడ టీడీపీకి సరైన ప్రాతినిధ్యం ఉండటం లేదు. 2014లో ఓడిపోయిన రావి వెంకటేశ్వరరావు...ఇప్పుడు సైడ్ అయిపోగా, 2019లో ఓడిపోయిన దేవినేని అవినాష్ వైసీపీలోకి వెళ్ళిపోయారు.
దీంతో గుడివాడలో టీడీపీకి నాయకుడే లేకుండా పోయాడు. ఇక రెండోసారి గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన వల్లభనేని వంశీ జగన్కు మద్ధతు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో వంశీ వెళ్లిపోయాక గన్నవరం టీడీపీ నాయకత్వ లేమీతో కొట్టుమిట్టాడుతుంది. గుడివాడ, గన్నవరం పరిస్తితి ఇలా ఉంటే....అవనిగడ్డ, నూజివీడుల పరిస్తితి మరోలా ఉంది. అవనిగడ్డ నుంచి మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్, వయసురీత్యా కావొచ్చు, ఓటమి ప్రభావం కావొచ్చు, ఆయన అసలు పెద్దగా బయట కనబడటం లేదు. నియోజకవర్గంలో పార్టీ తరుపున కార్యక్రమాలు చేసేందుకు కూడా ఆయన రావడం లేదు. దీంతో అవనిగడ్డ టీడీపీ కేడర్ వైసీపీలోకి వెళ్లిపోతుంది.
ఇటు నూజివీడు పరిస్తితి మరి దారుణంగా ఉంది. ఇక్కడ నుంచి వరుసగా రెండుసార్లు ఓడిపోయిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు...అడ్రెస్ లేరు. ఏదో ఎన్నికల సమయంలో తప్ప, ఆయన పార్టీలో కనిపించడం లేదు. ఫలితంగా నూజివీడులో టీడీపీ రాను రాను వీక్ అయిపోతుంది. మొత్తానికి ఈ నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్తితి తెరచాప లేని నావలాగా తయారైంది.