టీడీపీ ఎమ్మెల్సీల విషయంలో అధికార పార్టీ వైసిపి ఆడుతున్న మైండ్ గేమ్ తో టీడీపీ అధినేత చంద్రబాబుకు ముచ్చెమటలు పడుతున్నాయి. ముఖ్యంగా టిడిపి ఎమ్మెల్సీలు అధికార పార్టీ వైపు చూస్తూ ఉండడంతో పాటు ఈ రోజు జరిగిన టిడిపి శాసనసభా పక్ష సమావేశానికి నలుగురు ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టడంతో బాబులో మరింత కలవరం మొదలైంది. దీంతో రంగంలోకి దిగిన బాబు తమ ఎమ్మెల్సీలు ఎవరు చేజారి పోకుండా వారిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. పార్టీకి చెందిన వారు ఎవరూ వైసిపి ట్రాప్ లో పడవద్దని, ఏం జరిగినా తాను చూసుకుంటానని వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
అయితే టీడీపీ ఎమ్మెల్సీలు తమ దారిలోకి వస్తే వారికి ఒక్కొక్కరికి ఐదు కోట్ల వరకు ఇచ్చేందుకు అధికార పార్టీ నేతలు టీడీపీ ఎమ్యెల్సీలకు ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో టిడిపి అధినేత చంద్రబాబు లో మరింతగా కంగారు పడుతున్నట్టు తెలుస్తోంది. ఒక వేళ మండలిని జగన్ రద్దు చేయించినా మీరు ఎవరూ కంగారు పడవద్దని, ఎమ్యెల్సీలంతా త్యాగాలకు సిద్ధం కావాలంటూ సూచించినట్టు తెలుస్తోంది. మీరు అలా త్యాగం చేస్తే చరిత్రలో నిలిచిపోతారంటూ చంద్రబాబు నాయుడు వారిని ఊరడింపు చేసినట్టు తెలుస్తోంది.అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బాబు మాట ఎంతమంది వింటారో తెలియని పరిస్థితి నెలకొంది.
ఎలాగు వైసీపీ ప్రభుత్వం మండలిలో మళ్లీ వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడు గనుక ఎమ్మెల్సీలు మళ్లీ అడ్డుపడితే మండలి రద్దుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అలా కాకుండా జగన్ అనుకుంటున్నట్టుగా అన్ని వ్యవహారాలు సాఫీగా సాగిపోతే మండలి రద్దు నిర్ణయాన్ని జగన్ వెనక్కి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
అయితే టీడీపీ ఎమ్యెల్సీ లను తమ వైపు తిప్పుకునేందుకు అధికార పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని, మాట వినని వారిని కేసులతో బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఏది ఏమైనా తమ ఎంఎల్సీలు ఎవరూ చేజారిపోకుండా టీడీపీ అందరిపైనా నిఘా పెట్టింది.