కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టీ అయిన శివసేన తన శత్రువులైన కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. ముప్పయ్యేళ్లుగా బీజేపీతో ఉన్న స్నేహాన్ని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే తన కుమారుడు ఆదిత్య కోసం వదిలేసుకున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీలతో పొత్తు పెట్టుకుని శివసేన పవర్లోకి రావడంపై ఆ పార్టీ కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని బీజేపీ క్యాష్ చేసుకోవాలనుకుంటోందని సమాచారం. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) పార్టీ అధినేత రాజ్థాక్రేతో దోస్తీ కుదుర్చుకుంటున్నారని సమాచారం.
మహారాష్ట్ర రాజకీయాల్లో దూకుడుగా ఎంట్రీ ఇచ్చిన ఎంఎన్ఎస్ కొంతకాలంగా చాలా వెనుకబడిపోయింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 13 సీట్లు గెలుచుకుని నాలుగో పెద్ద పార్టీ అయింది. మరో 24 స్ఠానాల్లో రెండో ప్లేస్లో నిలబడింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి 144 సీట్లతో అధికారంలోకి రాగా, శివసేన–బీజేపీ కూటమి 90 సీట్లు తెచ్చుకుని ప్రతిపక్షంలో కూర్చున్నాయి. ఎంఎన్ఎస్కి చాలా భవిష్యత్తు ఉందని అందరూ అనుకున్నారు. ముంబై నగరంలో ఆరు సీట్లు, నాసిక్లో 3, థానే జిల్లాలో రెండు, ఫుణే, ఔరంగాబాద్ల్లో ఒక్కొక్కటి ఎన్ఎంఎస్ ఖాతాలో పడ్డాయి. 2012 నాటికి 16 కార్పొరేషన్లకు గాను బృహన్ ముంబై, నాసిక్, కల్యాణ్–దోంబీవాలీ, పుణే, జల్గావ్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మంచి సత్తా చూపించింది. కానీ ఇదే ఊపు కొనసాగించలేకపోయింది.
ఎంఎన్ఎస్ వల్ల ఇప్పటికిప్పుడు బీజేపీకి ఒరిగేదేమీ లేదని ఆ పార్టీకి తెలుసు. మహారాష్ట్రలో దెబ్బకు దెబ్బ తీయాలన్న కసితో బీజేపీ ఉన్నట్లుగా చెబుతున్నారు. అందుకే రాజ్ థాక్రేని తమతో కలుపుకోవాలన్న నిర్ణయానికి వచ్చిందంటున్నారు. ఈ మేరకు పరిణామాలు మారుతున్నాయి. ఈ నెల రెండోవారంలో ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రేతో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ కావడం కూడా అలాంటిదే. కేవలం ఫ్రెండ్లీగానే కలిశామని ఫడ్నవీస్ అన్నప్పటికీ, అసలు మతలబు వేరే ఉంటుందంటున్నారు. తన పెదనాన్న బాల్ థాక్రే 94వ జయంతి వేడుకల సందర్భంలో రాజ్ తన రాజకీయ ఎత్తుగడల్ని బయటపెట్టారు. ముంబై శివారులోని గోరేగావ్లో జరిగిన సభలో.. శివసేన ఫౌండర్ బాలా సాహెబ్ నమ్మిన మరాఠా సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. అంతకు ముందు జరిగిన పార్టీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో తమ పార్టీకి కొత్త జెండాని విడుదల చేశారు. కాషాయ జెండాలో శివాజీ మహారాజ్ ‘రాజముద్ర’ని చేర్చారు. పార్టీని పూర్తిగా కాషాయీకరణ చేయడమేకాక, కేంద్ర ప్రభుత్వ సిటిజెన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్నార్సీ)లకు మద్దతు ప్రకటించడంతో... ఢిల్లీలో ఎన్నికలు ముగిశాక మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు ఖాయమయ్యేలా ఉన్నాయి.