ఏపీ సీఎం జగన్ గత అసెంబ్లీ సమావేశాల్లో ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చని ప్రకటన చేసిన రోజు నుండి రాష్ట్ర ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో మూడు రాజధానుల గురించే చర్చ జరుగుతోంది. మూడు రాజధానులకు సంబంధించిన బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందగా మండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు తీసుకున్న నిర్ణయం వలన బిల్లు సెలక్ట్ కమిటీకి వెళ్లింది. సెలక్ట్ కమిటీకి బిల్లు వెళ్లటం వలన మూడు రాజధానుల అమలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. 
 
అందువలన ఏపీ సీఎం జగన్ శాసన మండలి రద్దు వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఈరోజు ఉదయం 9.30 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన కేబినేట్ సమావేశం కానుంది. శాసన మండలి రద్దు గురించే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుందని తెలుస్తోంది. ఈ సమావేశంలో శాసన మండలి రద్దు గురించి తీర్మానం చేయడంతో పాటు ఆ తీర్మానాన్ని ఆమోదించనున్నారని సమాచారం. 
 
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు వారంతట వారే వచ్చి బిల్లు విషయంలో మద్దతు ప్రకటిస్తే మాత్రం సీఎం జగన్ మండలిని రద్దు చేయాలా...? వద్దా...? అనే అంశం గురించి పునరాలోచించే అవకాశం ఉందని సమాచారం. జగన్ శాసన మండలిని రద్దు చేస్తారా...? లేదా..? అనే అంశం గురించి ఏపీ ప్రజలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. వైసీపీ ప్రభుత్వం ఊహించిన విధంగా ఎమ్మెల్సీలు వలస వస్తే మాత్రమే శాసన మండలి సేఫ్ గా ఉండనుంది. 
 
ఈరోజు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో మండలి అంశంపై ప్రత్యేక చర్చ జరగనుంది. టీడీఎల్పీ ఇప్పటికే అసెంబ్లీకి హాజరు కాకూడదని నిర్ణయం తీసుకుంది. రాజకీయ వర్గాలు టీడీపీ ఎమ్మెల్సీలు వలస వస్తే మాత్రమే శాసన మండలి సేఫ్ అవుతుందని లేకపోతే రద్దవుతుందని చెబుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయం కేబినేట్ సమావేశంలోనే తేలిపోనుందని తెలుస్తోంది. మండలి విషయంలో సీఎం జగన్ అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వడం ఖాయమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: