తెలంగాణ పురపాలక ఎన్నికల్లో కారు జోరు కొనసాగింది. తొమ్మిది కార్పొరేషన్లలో మేయర్ల ఎన్నిక పూర్తైంది. తొమ్మిది కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా… 9 పీఠాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. సోమవారం వెల్లడైన కరీంనగర్ కార్పోరేషన్లో కూడా టీఆర్ఎస్ దూసుకెళ్లింది. ఉత్కంఠ పోరులో ఏకంగా 33 సీట్లలో గులాబీ అభ్యర్థులు సత్తా చాటారు. బీజేపీ 13 సీట్లు గెలుచుకుంది. తద్వారా టీఆర్ఎస్ సులభంగా మేయర్ పీఠం కైవసం చేసుకుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీకి షాక్ తగిలింది.
కరీంనగర్లో ఎంఐఎం ఆరు సీట్లలో గెలుపొంది. ఇతరులు ఎనిమిది చోట్ల గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అసలు ఖాతానే తెరవకపోవడం గమనార్హం. దీనిపై మంత్రి గంగుల కమలాకర్ స్పందిస్తూ, భావోద్వేగాలను రెచ్చగొట్టి కొన్ని ఓట్లను బీజేపీ పొందాలని ప్రయత్నించిందని అయితే, ప్రభుత్వ పనితీరు నచ్చి ప్రజలు టీఆర్ఎస్ కు పట్టం కట్టారన్నారు . తమను నమ్మి ఓట్లేసిన ప్రజల కోసం రేపటి నుంచే పనిచేస్తామన్నారు. సీఎం సూచించిన వ్యక్తినే మేయర్ గా ఎంపిక చేస్తామని ప్రకటించారు. కాగా, తొమ్మిది కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. ఎన్నికలు జరిగిన 9 కార్పొరేషన్లలో మేయర్ల పదవులను అధికార పార్టీ టీఆర్ఎస్సే దక్కించుకుంది. కరీంనగర్కు మేయర్ ఎన్నిక జరగాల్సి ఉంది. ఎన్నికల సంఘం ఇచ్చే షెడ్యూల్ను అనుసరించి, పార్టీ నేతల అభిప్రాయం తీసుకొని ఈ మేరకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేయనుంది.
ఇప్పటివరకు ఎన్నికైన మేయర్ల వివరాలివి.
1. రామగుండం - బంగి అనిల్ కుమార్(మేయర్)
2. నిజాంపేట - కొలను నీలా రెడ్డి(మేయర్)
3. పీర్జాదిగూడ - జక్కా వెంకట్ రెడ్డి(మేయర్)
4. మీర్పేట - ముడవత్ దుర్గ(మేయర్)
5. బడంగ్పేట - పారిజాత(మేయర్)
6. జవహర్ నగర్ - మేకల కావ్య(మేయర్)
7. బండ్లగూడ జాగీర్ - మహేందర్ గౌడ్(మేయర్)
8. నిజామాబాద్ - దండు నీతూ కిరణ్(మేయర్)
9. బొడుప్పల్ - సామల బుచ్చిరెడ్డి(మేయర్)