జ్యోతిష్యం.. ఉందా.. ఆస్ట్రాలజీ ఉందా.. జరగబోయేదే ముందే చెప్పొచ్చా.. ఇవి ఎప్పటికీ ఆసక్తికరమైన ప్రశ్నలే.. మన తెలుగునాట వీరబ్రహ్మంగారు.. పాశ్చాత్య దేశాన నోస్ట్రడామస్ వంటి వారు భవిష్యత్తును ముందే అంచనా వేశారు. ఈ కాలంలోనూ ములుగు సిద్ధాంతి వంటి వారు జరగబోయేది చెబుతుంటారు. వీటి సంగతేమో కానీ.. తాజాగా.. ప్రముఖ బాస్కెట్బాల్ ఆటగాడు కోబ్ బ్రయింట్ ఆకస్మిక మరణం క్రీడాప్రపంచాన్ని కుదిపేసింది.
ఆదివారం కాలిఫోర్నియాలోని లాస్ఏంజెల్స్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో కోబ్, ఆయన కుమార్తె జియానా(13)తో సహా 9 మంది మృతి చెందారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం సుమారు 9 గంటలకు కోబ్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ లాస్ఏంజెల్స్లోని పశ్చిమాన ఓ కొండను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న వారంతా మృతిచెందారు. కోబ్ మృతిపై ప్రముఖులతో పాటు అతడి అభిమానులు పెద్ద ఎత్తున సంతాపం తెలుపుతున్నారు.
ఈ వార్త విని క్రీడాభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కేవలం బాస్కెట్ బాల్ అభిమానులే కాకుండా క్రీడాకారులు, సెలబ్రెటీలు బ్రయింట్ కు నివాళులు అర్పిస్తున్నారు. అంజలి ఘటిస్తున్నారు. ఇదే సమయంలో ఓ సంచలన విషయం వెలుగు చూసింది. అదేంటంటే.. కోబ్ బ్రయింట్ మరణవార్తను ఓ నెటిజన్ 2012లోనే ఊహించాడట. ఇందుకు సంబంధించిన ఓ పాత ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
నోసో’ అనే పేరుతో ఓ ట్విటర్ యూజర్.. బాస్కెట్బాల్ దిగ్గజం హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణిస్తాడని 2012 నవంబర్ 14న ట్వీట్ చేశాడు. ఇది చూసిన అతడి ఫాలోవర్లు అప్పట్లో నోసోపై మండిపడ్డారు. అయితే ఇపుడు అది నిజం కావడంతో .. అంతా ఆశ్చర్యపోతున్నారు.
అయితే ఆ నాటి తన ట్వీట్ కు సోమవారం ఆ నెటిజన్ ఏడేళ్ల నాటి తన ట్వీట్కు క్షమాపణలు చెప్పాడట. ప్రముఖ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు అని చెప్పడం, హెలికాప్టర్ ప్రమాదం అని కూడా చెప్పడంతో అంతా షాక్ గురవుతున్నారు. మరి కొందరు ఇదంతా తప్పుడు వ్యవహారం అని కొట్టిపారేస్తున్నారు. ట్వీట్ లో తేదీ మార్చి ఇలా ప్రచారం చేస్తున్నారని మరికొందరు అంటున్నారు.