రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో పోలీసుల పరిశోధన తుది దశకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ ప్రయోగశాల దిశను అత్యాచారం చేసిన నిందితులు మహ్మద్ షాషా, చెన్నకేశవులు, జొల్లు శివ, నవీన్ కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను సేకరించింది. 2019 డిసెంబర్ 2వ వారంలో షాద్ నగర్ పోలీసులు దిశ కేసుకు సంబంధించిన 40 సాక్ష్యాధారాలను పరీక్షల కొరకు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. 
 
ఈ సాక్ష్యాధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్ లో నూతన టెక్నాలజీతో కూడిన యంత్రాలు, పరికరాలు మరియు సూక్ష్మ పరికరాలతో విశ్లేషించారు. టోల్ ప్లాజా దగ్గర దిశను లాక్కెళ్లే సమయంలో నిక్షిప్తమైన సీసీ కెమెరా ఫుటేజీ, దిశ, ఆమె సోదరి స్వరాలు, కాల్ డేటా, కాల్ రికార్డ్స్, మెసేజెస్ కు సంబంధించిన నివేదికలను ప్రత్యేకంగా రూపొందించినట్టు తెలుస్తోంది. ఫోరెన్సిక్ నిపుణులు మరో రెండు రోజుల్లో వీటిని పోలీసులకు అందజేయనున్నారు. 
 
దిశ అత్యాచారానికి సంబంధించిన అత్యంత కీలకమైన దృశ్యాలు తొండుపల్లి టోల్ ప్లాజా దగ్గర ఉన్న సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. దిశ నిందితులతో మాట్లాడటం, దిశను లారీ దగ్గరకు లాక్కెళ్లడం, ఇలా దిశ ఘటనకు సంబంధించిన కీలక దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఫోరెన్సిక్ ప్రయోగశాల అధికారులు టెక్నాలజీని వినియోగించి మరింత స్పష్టంగా నిందితుల ముఖాలు కనిపించేలా చేశారు. 
 
పోలీసులు ఒక సీసీ కెమెరాను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారని సమాచారం. దిశ ఆమె సోదరితో మాట్లాడిన కాల్ రికార్డులను పరిశీలించగా ఆ స్వరాలు వారివేనని పరీక్షల ద్వారా నిర్ధారణ అయింది. దిశ అంతకుముందు ఎక్కువగా ఎవరితో మాట్లాడిందో ఆ వివరాలను కూడా పోలీసులు సేకరించారు. మరోవైపు చటాన్ పల్లి దగ్గర దిశ నిందితుల ఎన్ కౌంటర్ తరువాత పోలీసుల రివాల్వర్లను, తూటాలను బాలిస్టిక్ నిపుణులు పరిశీలించి అందుకు సంబంధించిన రిపోర్టును కూడా ఇచ్చినట్టు సమాచారం. ఒక పోలీస్ ఉన్నతాధికారి విచారణ సమయంలో న్యాయస్థానానికి ఈ సాక్ష్యాధారాలను సమర్పించనున్నట్టు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: