ఒక వ్యక్తి కొన్ని రోజుల క్రితం ఇంట్లో కుటుంబ కలహాల వలన ఇంటి నుండి వెళ్లిపోయాడు. ఆ తరువాత ఆ వ్యక్తి శవం కుటుంబ సభ్యులకు దొరికింది. కుటుంబ సభ్యులు అతని శవానికి అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. కానీ ఊహించని విధంగా ఆ వ్యక్తి మరలా గ్రామానికి తిరిగి వచ్చాడు. చనిపోయిన వ్యక్తి ఊరికి తిరిగి రావడంతో గ్రామస్తులు కూడా షాక్ కు గురయ్యారు. 
 
పూర్తి వివరాలలోకి వెళితే ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పొట్లపాడు గ్రామంలో 45 సంవత్సరాల వయస్సు గల పోలెబోయిన వెంకటరావు అనే వ్యక్తి సంక్రాంతి పండుగ తరువాత ఇంటి నుండి వెళ్లిపోయాడు. ఆ తరువాత కురిచేడు మండలంలో ఒక అనాథ శవం దొరికింది. ముఖం గుర్తు పట్టలేని స్థితిలో ఉండగా పోలీసులు, గ్రామస్థులు, వెంకటరావు కుటుంబ సభ్యులు అది వెంకటరావు శవమేనని చెప్పారు. 
 
పోలీసులు వెంకట రావు శవాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వెంకటరావు కుటుంబ సభ్యులు వెంకటరావు చనిపోయాడని కన్నీరు మున్నీరయ్యారు. ఆ తరువాత అతనికి అంత్యక్రియలు కూడా చేశారు. అంత్యక్రియలు జరిగిన తరువాత ఆ గ్రామానికి చెందిన వ్యక్తి ఒకరు వెంకటరావు భార్య అంజనాదేవికి ఫోన్ చేసి రాయవరం తిరునాళ్లలో వెంకటరావు ఉన్నాడని 
చెప్పి మొబైల్ ఫోన్ లో అతని ఫోటోలు, వీడియోలు తీసి ఆమెకు పంపించాడు. 
 
ఆ తరువాత అంజనాదేవి అక్కడికి వెళ్లి తన భర్తను గ్రామానికి తీసుకొనివచ్చింది. చనిపొయాడనుకున్న వెంకటరావు గ్రామానికి రావడంతో గ్రామస్తులు షాక్ కు గురయ్యారు. ఆ తరువాత అసలు నిజం తెలిసి ఆశ్చర్యపోయారు. వెంకటరావు గ్రామానికి తిరిగి రావడంతో కొత్త సమస్య మొదలైంది. వెంకటరావు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరిపిన అనాథ శవం ఎవరిది అనే విషయం తెలియాల్సి ఉంది. పోలీసులు కాలిపోయిన శవం ఎవరిది అనే విషయం గురించి దర్యాప్తు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: