శాసనమండలి రద్దుకు జగన్మోహన్ రెడ్డి డెడ్ లైన్ పెట్టారని సమాచారం. రాబోయే బడ్జెట్ సమావేశాలకల్లా శాసనమండలి రద్దుకు కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చేయాలని ఎంపిలకు జగన్ స్పష్టమైన ఆదేశాలిచ్చారట. మార్చి మొదటి వారంలో రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు పెట్టుకోవాలని జగన్ అనుకుంటున్నట్లు సమాచారం. మార్చి 31వ తేదీలోగా బడ్జెట్ ప్రవేశపెట్టాలి. దీనిబట్టి చూస్తుంటే మార్చి మొదటి వారంలోగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది.
కాబట్టి ఈలోగానే మండలి రద్దుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించేట్లుగా అవసరమైన గ్రౌండ్ వర్క్ చేయాలని ఎంపిలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డితో పాటు మరో నలుగురు ఎంపిలకు జగన్ బాధ్యతలు అప్పగించారని పార్టీ వర్గాలు చెప్పాయి. సోమవారం రాత్రి మండలి రద్దుకు అసెంబ్లీ తీర్మానం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే అసెంబ్లీ తీర్మానం అయిపోయిందో వెంటనే ఆ ఫైల్ ను అసెంబ్లీ సచివాలయం అధికారులు ప్రధాన కార్యదర్శికి పంపేశారు.
ప్రధాన కార్యదర్శి కూడా ఆ ఫైల్ ను ఓసారి చెక్ చేసి వెంటనే కేంద్ర హోంశాఖకు పంపేశారు. హోంశాఖ తో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా రాష్ట్రప్రభుత్వం నుండి ఓ కాపీ వెళిపోయిందట. అంటే అసెంబ్లీ తీర్మానం కాపీ వెళ్ళిపోయింది కాబట్టి ఇక కేంద్ర హోం శాఖలో ఆ ఫైల్ ను ఫాలో అప్ చేయటం ఎంపిల బాధ్యత. ఎలాగూ ఫిబ్రవరి 3వ తేదీ నుండి రెండో విడత పార్లమెంటు సమావేశాలు మొదలవ్వబోతున్నాయి.
ఇప్పటికే కేంద్ర హోం శాఖకు ఫైల్ చేరింది కాబట్టి గట్టిగా ఫైల్ వెంటపడితే, హోం శాఖ మంత్రి అయిత్ షా గనుక అనుకుంటే మండలి రద్దు ప్రతిపాదన అంశాన్ని పార్లమెంటులోని ఉభయసభల్లో అజెండాగా చేర్చటం పెద్ద విషయం కూడా కాదు. అదే సమయంలో ఏపిలో శాసనమండలి రద్దు విషయంలో జాతీయ పార్టీలకు ఏమి ఆశక్తి ఉంటుంది. అందులోను వైసిపి ఎంపిలు మద్దతు కోసం ఇతర పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలతో కూడా మాట్లాడుతున్నారు.
ఇప్పటికే డిఎంకె, ఏఐఏడిఎంకె, ఎస్పి, ఎన్సిపి తదితర పార్టీల ఎంపిలతో మాట్లాడినట్లు సమాచారం. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన పార్లమెంటు ఆమోదం రావచ్చని అనుకుంటున్నారు. ఉభయసభల ఆమోదం వచ్చేస్తే రాష్ట్రపతి ఆమోదం ఇక లాంఛనమే. కాబట్టి జగన్ అనుకుంటున్నట్లుగా బడ్జెట్ సమావేశాలకల్లా శాసనమండలి రద్దు అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తానికి మండలి రద్దు విషయంలో జగన్ ను అనవసరంగా రెచ్చగొట్టి చంద్రబాబు, యనమల అండ్ కో తమ నెత్తిన తామే చెత్త వేసుకున్నట్లైంది.