శాసనమండలి ఛైర్మన్ ఏం ఏ షరీఫ్ చేసిన కంపును మరింత కంపు చేయటానికి తెలుగుదేశంపార్టీ తన స్పీడు పెంచింది. ఇందులో భాగంగానే అసెంబ్లీ సెక్రటేరియట్ ఉన్నతాధికారులపై బాగా ఒత్తిడి పెడుతోంది. నాలుగు రోజుల క్రితం అసెంబ్లీ ఆమోదించిన రెండు కీలక బిల్లులు శాసనమండలి ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ బిల్లులపై చర్చ జరగకుండా అడ్డుకున్న టిడిపి చివరకు ఛైర్మన్ ను మ్యానేజ్ చేసి సెలక్ట్ కమిటి పరిశీలను పంపుతున్నట్లు ప్రకటింపచేసింది.
తనంతట తానుగా బిల్లులను సెలక్ట్ కమిటి పరిశీలనకు పంపించే అధికారం ఛైర్మన్ కు లేదు. ఆ విషయంలో చంద్రబాబునాయుడు, యనమల రామకృష్ణుడు ఛైర్మన్ ను మ్యానేజ్ చేసి మండలి ప్రతిష్టను భ్రష్టుపట్టించారంటూ వైసిపి మండిపోతోంది. మండలి ఛైర్మన్ కున్న అధికారాలను అధికారులు వివరించి చెప్పినపుడు విన్నట్లే విన్న ఛైర్మన్ తర్వాత మళ్ళీ ప్లేటు ఫిరాయించారు. దాంతో టిడిపి నేతలు ఆయనపై ఏ స్ధాయిలో ఒత్తిడి పెడుతున్నారో అందరికీ అర్ధమైపోయింది.
ఇపుడు ఇదే ఒత్తిడిని ఛైర్మన్ నుండి అధికారులపైకి మళ్ళించింది టిడిపి. నిబంధనల ప్రకారం సెలక్ట్ కమిటికి మెంబర్లను పంపాల్సిందిగా ఛైర్మన్ అన్నీ పార్టీలకు లేఖలు రాయాలని అధికారులను ఆదేశించారు. అయితే సెలక్ట్ కమిటి నియమించటమే నిబంధనలకు విరుద్ధమంటే మళ్ళీ పార్టీలకు లేఖలు రాయటమని ఛైర్మన్ ఆదేశించటంతో అధికారులు తలలు పట్టుకున్నారు. లేఖలు రాయాలని ఛైర్మన్ ఒకవైపు నిబంధనల ప్రకారమే నడుచుకోవాలంటూ అధికారపార్టీ మరొవైపు అధికారుల బుర్రలు తినేస్తున్నారు. బహుశా మండలి రద్దు తీర్మానం వల్లే ప్రభుత్వాన్ని గబ్బు పట్టించాలని టిడిపి ప్లాన్ చేస్తున్నట్లుంది.
ఈ సమస్య ఇలాగుంటే టిడిపి నుండి సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఏకంగా అసెంబ్లీ ఉన్నతాధికారులను కలిసి ఛైర్మన్ ఆదేశించినట్లుగా వెంటనే పార్టీలకు లేఖలు రాయాలని బాగా ఒత్తిడి పెడుతున్నట్లు సమాచారం. అంటే టిడిపి ఒత్తిడి ప్రకారం అధికారులు గనుక లేఖలు రాస్తే వ్యవహారం మరింత భ్రష్టుపట్టటం ఖాయం. అంటే టిడిపి తాను గబ్బు పట్టడమే కాకుండా అందరినీ గబ్బు పట్టించే ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టంగా అర్ధమైపోతోంది. మరి ఈ సమస్య ఎలా పరిష్కారమవుతుందో చూడాల్సిందే.