విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం భారీ ల్యాండ్ పూలింగ్‌కు రంగం సిద్ధం చేసింది. విశాఖ పరిధిలోని 10 మండలాల్లో భూ సమీకరణ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆరు వేల ఎకరాలను సేకరించేందుకు జీవో జారీ చేసింది. అర్బన్ హౌసింగ్ కోసం ఈ భూములను ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. సేకరించిన భూములను అభివృద్ధి చేసే బాధ్యతను విశాఖ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి అప్పగించారు. 

 

విశాఖకు రాజధాని ప్రకటనతో, స్టీల్ సిటీలో ల్యాండ్ పూలింగ్‌కు ప్రభుత్వం సిద్దమైంది. విశాఖ శివారు గ్రామాల్లో 6వేల ఎకరాల సేకరణకు సర్కార్  జీవో జారీ చేసింది. జీవో 72 ప్రకారం సబ్బవరం, పెందుర్తి, గాజువాక, పరవాడ, పద్మనాభం, భీమిలి, అనకాపల్లి, విశాఖ రూరల్, పెద గంట్యాడ, ఆనందపురం ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ జరగనుంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో అధికారుల హడావుడి మొదలైంది.

 

ల్యాండ్ పూలింగ్‌ కింద సేకరించే భూములను విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీకి అప్పగించారు.  ఆ స్థలాల్లో వి.ఎమ్.ఆర్.డి.ఎ  ప్లాట్లను అభివృద్ది చేసి ఇవ్వనుంది. ఉగాది నాటికి 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వ భూములతో పాటు ఇతర ప్రత్యమ్నాయ మార్గాల ద్వారా స్థలాలను సేకరిస్తోంది. 

 

ల్యాండ్ పూలింగ్‌ పేరుతో ప్రభుత్వం పేదల భూములు లాక్కుంటోందని సీపీఎం మండిపడుతోంది. ల్యాండ్ పూలింగ్‌ను వ్యతిరేకిస్తామన్నారు ఆ పార్టీ నేత మధు.  భూసేకరణ చట్టం ప్రకారం ల్యాండ్ పూలింగ్ చేపడితే.. తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు.  ఇప్పటికే అధికారులు...ఆయా మండలాల పరిధిలో అసైన్డ్, ప్రభుత్వ భూములను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. మొత్తానికి విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే ల్యాండ్ పూలింగ్ కు సిద్ధమైంది. పేదలకు మంచి చేయాలనే దృక్పథంతో ప్రణాళికలు వేస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: