ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు. ఏకంగా 55 మంది సభ్యులు. ఒక్క పెన్ స్ట్రోక్తో పదవులను కొల్పోబోతున్నారు. మండలి రద్దు ప్రక్రియ ఇంకా పూర్తి కాకున్నా.. పరిణామాలు ఎటు దారి తీస్తుందో ఇప్పుడే చెప్పకున్నా.. ప్రస్తుతం సభ్యులుగా ఉన్న55 మంది మాత్రం ఇదే భావనతో ఉన్నారు. తమను తాము దురదృష్టవంతులుగా భావించుకుంటున్నారు. వీరిలో కొద్ది మంది ఎక్కువ దురదృష్టవంతులైతే.. ఇంకొందరు తక్కువ దురదృష్టవంతులని లెక్కలేస్తున్నారు. ఇంతకీ వీరిలో ఎవరు ఎక్కువ..? ఎవరు తక్కువ..?
ప్రస్తుతం శాసన మండలిలో ఉండాల్సిన సభ్యుల సంఖ్య 58 . అయితే.. మూడు ఖాళీలు ఉండడంతో ప్రస్తుతం 55 మంది సభ్యులు ఉన్నారు. వచ్చే నెల రెండో తేదీ నుంచి మొదలుకుని.. 2025 సంవత్సరం మార్చి వరకు విడతల వారీగా ఈ సభ్యులు రిటైర్ కావాల్సి ఉంది. అతి తక్కువ కాలంలో రిటైర్ అయ్యే సభ్యులు కాస్త ఊపిరీ పీల్చుకుంటుంటే.. 2025 సంవత్సరం వరకు గడువు ఉన్న సభ్యులు మాత్రం ఇదెక్కడి గొడవ అంటూ నిట్టూరుస్తున్నారు. వీరిలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సభ్యులే ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో ఎవరెవరు ఎప్పుడు రిటైర్ కాబోతున్నారనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఈ ఏడాది వచ్చే నెల రెండో తేదీన ఇద్దరు సభ్యులు రిటైర్ కాబోతున్నారు. ఈ రెండు స్థానాలు గవర్నర్ కోటాలోనే ఉన్నాయి. వీరిలో ఒకరు కంతేటి సత్యనారాయణ రాజు అయితే.. మరొకరు టి. రత్నభాయ్. వీరిలో కంతేటీ సత్యనారాయణ రాజు మండలి పునరుద్దరణలో కీలక పాత్ర పోషించారు. అటువంటి కంతేటీ రాజు.. మండలి రద్దు ప్రతిపాదన సమయంలోనూ ఉండడాన్ని ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
ఇక 2021 ఏడాదికి రిటైర్ అయ్యే సభ్యుల జాబితా పెద్దదిగానే ఉంది. ఎమ్మెల్యే కోటా నుంచి 8 మంది ఉన్నారు. వీరిలో టీడీపీ నుంచి ప్రస్తుత మండలి ఛైర్మన్ షరీఫ్ మొదలుకుని తిప్పేస్వామి, సంధ్యారాణి, వీవీవీ చౌదరి వంటి నలుగురు సభ్యులు ఉంటే.. వైసీపీ నుంచి మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఇటీవలే మండలిలోకి వచ్చిన ఇక్బాల్, దేవసాని చిన్న గోవింద రెడ్డి ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి సోము వీర్రాజు ఉన్నారు. హిందూపురం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి చెందిన ఇక్బాల్కు మండలిలో స్థానం కల్పించి చట్టసభల్లోకి ప్రవేశం కల్పించింది వైసీపీ. ఇప్పుడాయన చట్ట సభల ముచ్చట మూణ్నాళ్లకే పరిమితం కానుంది.
ఇక స్థానిక సంస్థల కోటా నంచి 2021 ఏడాదిలో రిటైర్ అయ్యే సభ్యుల సంఖ్య 11 మంది అయితే.. వీటిల్లో అనంత, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అంటే తొమ్మిది మంది సభ్యులు రిటైర్ కానున్నారు. వీరిలో టీడీపీ నుంచి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం సహా వైవీబీ రాజేంద్ర ప్రసాద్, పప్పల చలపతి రావు, గాలి సరస్వతి, బుద్దా వెంకన్న, ద్వారంపూడి జగదీష్, బుద్దా నాగ దీశ్వరరావు ఉన్నారు.
ఇక వైసీపీ నుంచి మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారు. వీరిలో గాలి ముద్దుకృష్ణమ నాయుడు చనిపోయిన తర్వాత ఆ స్థానాన్ని ఆయన సతీమణి గాలి సరస్వతి కట్టబెట్టింది టీడీపీ. ఇక టీచర్ల కోటా నుంచి ఇద్దరు, గవర్నర్ కోటా నుంచి నలుగురు రిటైర్ కాబోతున్నారు.
2021 తర్వాత తిరిగి 2023 ఏడాదిలో ఇంకొందరు రిటైర్ కానున్నారు. వీరిలో ఎమ్మెల్యే కోటా నుంచి ఏడుగురు ఉంటే.. వారిలో టీడీపీ నుంచి నలుగురు, వైసీపీ నుంచి ముగ్గురు ఉన్నారు. టీడీపీ నుంచి రిటైర్ అయ్యే వారిలో చంద్రబాబు తనయుడు లోకేష్ 2023లో రిటైర్ కావాల్సి ఉంది. లోకేష్తో పాటు.. బచ్చుల అర్జునుడు, మాణిక్య వరప్రసాద్, పోతుల సునీత ఉన్నారు. వీరిలో మాణిక్య వరప్రసాద్ ఇప్పటికే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా.. పోతుల సునీత పార్టీ మారారు. ఇక వైసీపీ నుంచి రిటైర్ అయ్యేవారిలో మంత్రి మోపిదేవి, ఇటీవలే పార్టీలో చేరి ఎమ్మెల్సీ స్థానం దక్కించుకున్న చల్లా రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి వంటి ఉన్నారు.
స్థానిక సంస్థల కోటా నుంచి 9 మంది ఎమ్మెల్సీలు రిటైర్ కానున్నారు. వీరంతా టీడీపీకి సంబంధించిన వారే. దీపక్ రెడ్డి, బీటెక్ రవి, కేఈ ప్రభాకర్, బీఎన్ రాజ సింహులు, చిక్కాల రామచంద్రరావు, అంగర రామ్మోహన్, మంతెన సత్యనారాయణ రాజు, శత్రుచర్ల, వాకాటి నారాయణ రెడ్డి ఉన్నారు. వీరిలో వాకాటి ప్రస్తుతం బీజేపీకి జంప్ అయ్యారు. అలాగే గ్రాడ్యుయేట్స్ కోటాలోని ముగ్గురు రిటైర్ కావాల్సి ఉంది. అలాగే గవర్నర్ కోటా నుంచి ఇద్దరు రిటైర్ కానున్నారు.
ఇక 2025 ఏడాదిలో రిటైర్ అయ్యే ఎమ్మెల్సీలను అత్యంత దురదృష్టవంతులుగా భావిస్తున్నారు. వచ్చే ఎన్నికలు ముగిసిన ఏడాది తర్వాత కూడా మండలిలో సభ్యులుగా కొనసాగే అవకాశం వీరికి ఉంది. వీరిలో ఎమ్మెల్యేల కోటా నుంచి రిటైర్ అయ్యే సభ్యుల సంఖ్య ఐదుగురు కాగా.. వీరిలో టీడీపీ నుంచి నలుగురు.. వైసీపీ నుంచి ఒకరు రిటైర్ కాబోతున్నారు. టీడీపీ నుంచి యనమల, బీటీ నాయుడు, అశోక్ బాబు, దువ్వారపు రామారావు ఉంటే, వైసీపీ నుంచి జంగా కృష్ణమూర్తి ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ కోటా నుంచి కెఎస్ లక్ష్మణ్ రావుు, వెంకటేశ్వరరావులు పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. వారు 2025లో రిటైర్ కావాల్సి ఉంటుంది. టీచర్ల కోటా నుంచి పాకాలపాటి రఘు వర్మ కూడా పీడీఎఫ్ నుంచి ఉన్నారు. వీరిని అత్యంత దురదృష్టవంతులుగా రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు.