టీడీపీ పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తన ట్విట్టర్ ఖాతా ద్వారా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో విజయసాయిరెడ్డిని కూడా విచారించాల్సి ఉందంటూ బుద్ధా వెంకన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వివేకానంద రెడ్డి కుమార్తె సునీతకు సీబీఐ విజయసాయిరెడ్డిని కూడా విచారించాలని కోరుతూ మరో పిటిషన్ వేయాలని సూచనలు ఇచ్చారు. 
 
తన ట్విట్టర్ ఖాతా ద్వారా బుద్ధా వెంకన్న ఈరోజు విజయసాయి రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. విజయసాయి రెడ్డి వివేకా చనిపోయిన రోజు ప్రెస్ మీట్ పెట్టారని ఆ ప్రెస్ మీట్లో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ సంభ్రమాశ్చార్యాలకు గురైనట్లు చెప్పారని బుద్ధా వెంకన్న అన్నారు. ఏపీ సీఎం జగన్ బాబాయ్, మాజీ ముఖ్యమంత్రి, దివంగతనేత రాజశేఖర్ రెడ్డి సోదరుడు చనిపోతే విజయసాయి రెడ్డి ఎందుకు సంబరాలు చేసుకున్నారో చెప్పాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. 
 
వివేకానంద రెడ్డి హత్య కేసులో చిక్కుముడి వీడిపోవాలంటే విజయసాయిరెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షలు చేయించాలని అన్నారు. విజయసాయిరెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహిస్తే విజయసాయిరెడ్డి ఎందుకు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడో తెలుస్తుందని తన ట్వీట్లలో బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. బుద్ధా వెంకన్న ట్వీట్లపై విజయసాయి రెడ్డి లేదా వైసీపీ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో ఛూడాల్సి ఉంది. 
 
గత కొన్ని రోజులుగా విజయసాయిరెడ్డి, బుద్ధా వెంకన్న మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం కూడా బుద్ధా వెంకన్న క్షుద్ర పూజలకు విజయసాయి రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని జగన్ ముఖ్యమంత్రి కావాలని విజయసాయి రెడ్డి క్షుద్ర పూజలు చేయించాడని ఆరోపణలు చేశారు. ఈ ట్విట్టర్ వార్ ఇంకెంతకాలం కొనసాగుతుందో చూడాల్సి ఉంది. 


 
 

మరింత సమాచారం తెలుసుకోండి: