దాదాపు 50 ఏళ్లుగా ఈయూతో కలిసి సాగిన బ్రిటన్ ప్రయాణానికి తెరపడింది. బ్రిగ్జిట్ నుంచి బయటకు వచ్చిన బ్రిటన్.. నేటి నుంచి స్వతంత్రంగా ఉండనుంది. అందుకు సంబంధించిన బిల్లుకు ఈయూ పార్లమెంటు ఆమోదం తెలపడంతో.. ఈ ప్రక్రియ పూర్తయ్యింది.
బ్రిటన్ చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వేరుపడేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. దీనిపై క్వీన్ ఎలిజబెత్-2 కూడా సంతకం చేశారు. దీంతో బ్రెగ్జిట్ నుంచి ఎగ్జిట్ అయిన బ్రిటన్.. జనవరి 31.. అంటే.. ఇవాళ్టి నుంచే స్వతంత్ర దేశంగా ఉండనుంది. దీనికి సబంధించిన ప్రక్రియ పూర్తయినట్టేనని.. ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.
బ్రెగ్జిట్ కు సంబంధించి ఈయూ తో కుదుర్చుకున్న ఒప్పందానికి బ్రిటన్ పార్లమెంట్ దిగువ సభ.. హౌస్ ఆఫ్ కామన్స్ 330-231 ఓట్ల తేడాతో ఆమోదముద్ర వేసింది. దీనికి ఎగువ సభ కూడా ఓకే చెప్పడంతో బ్రిటన్ స్వసంత్రంగా మారిపోయింది. ఐరోపా దేశాల సమాఖ్య నుంచి విడిపోయింది.
ఈ బిల్లుపై ఈయూలో జరిగిన చర్చ సందర్భంగా చట్ట సభ్యులందరూ 50 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం 621-49 తేడాతో బ్రెగ్జిట్ ఒప్పందానికి ఆమోదం తెలిపారు. ఆల్డ్ లాంగ్ సైన్ అనే సంప్రదాయ పాటతో ఈయూ పార్లమెంట్.. బ్రిటన్ కు వీడ్కోలు పలికింది.
బ్రెగ్జిట్ అజెండాతోనే పదవి చేపట్టిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఎట్టకేలకి తన పంతాన్నినెగ్గించుకున్నారు. ఈయూ నుంచి వైదొలిగేందుకు పట్టుదలతో కృషి చేసి విజయం సాధించారు. 2018లో అప్పటి ప్రధాని థెరిసా మే బ్రెగ్జిట్ కోసం చర్చలు జరిపినా దిగువసభ తిరస్కరించడంతో రాజీనామా చేశారు. ఆ తర్వాత పీఠమెక్కిన బోరిస్.. సభలో మెజారిటీ లేకపోవడంతో ఎన్నికలకు వెళ్లారు. సంపూర్ణ మెజారిటీతో మళ్లీ ప్రధాని బాధ్యతలు చేపట్టి.. తన బ్రెగ్జిట్ కలను సాకారం చేసుకున్నారు.