జోరుమీద ఉన్నప్పుడే అన్ని పనులు ముగించేయాలన్నదే తెలంగాణ సీఎం కేసీఆర్ లక్ష్యంగా కనపడుతోంది. గత కొన్నేళ్లుగా తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా టీఆర్ఎస్కు అనుకూలంగా వార్ వన్సైడే అయిపోతోంది. ఇక ఇదే ఊపులో 2018 డిసెంబర్లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ ఆ ఎన్నికల్లో తిరుగులేని బంపర్ మెజార్టీతో ఘనవిజయం సాధించారు.
ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో చిన్న జర్క్ తగిలినా పంచాయతీ, మండల, జడ్పీ ఎన్నికల్లో కారు తిరుగులేని విజయం సాధించింది. పంచాయతీ ఎన్నికల్లో 90 శాతానికి పైగా పంచాయతీలు కైవసం చేసుకున్న కారు పార్టీ ఆ తర్వాత జరిగిన జడ్పీ ఎన్నికల్లో తెలంగాణలోని 32 జడ్పీ చైర్మన్లను కైవసం చేసుకుని క్వీన్స్వీప్ చేసింది. ఇక కొద్ది రోజుల క్రితం జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నికల్లోనూ ఏకంగా 43 వేల ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించింది.
పైగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి రాజీనామా చేసిన స్థానంలో టీఆర్ఎస్ గెలవడంతోనే ఆ పార్టీ సత్తా ఏంటో ఫ్రూవ్ అయ్యింది. ఇక తాజాగా జరిగిన నగర పాలక సంస్థలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ వార్ వన్సైడ్ చేసేసింది. ఇలా వరుస పెట్టి ప్రతి ఎన్నికల్లోనూ విజయాలు సాధించుకుంటూ పోతోన్న కేసీఆర్ ఇప్పుడు మరోసారి ఎన్నికలకు రెడీ అవుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని అధికారుల్ని ఆదేశించారు.
ఇప్పటికే పదవీ కాలం ముగిసినందున వీటి ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ఈ సహకార సంఘాలకు ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు నామినేషన్లు వేయవచ్చు. ఇక 15 ఎన్నికలు నిర్వహించి... అదే రోజు ఫలితాలు నిర్వహిస్తారు. కొత్త పాలక వర్గాల్ని నియమించాలని కేసీఆర్ ఆదేశాల్లో జారీ చేశారు. వాస్తవానికి సహకార సంఘాలకు ఉమ్మడి రాష్ట్రంలో 2013లో ఎన్నికలు జరిగాయి. వీటికి 2018లోనే ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. వాయిదా పడుతున్నాయి.
ఇక ఉమ్మడి రాష్ట్రంలో 584 మండలాలకు 906 సహకార సంఘాలు ఉండేవి. అయితే.. మండలాల సంఖ్య పెరిగిన నేపథ్యం లో ఈసారి మొత్తం 1340 సహకార సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనే అనుకోవాలి. ఇక్కడ కూడా కారు జోరుకు బ్రేక్ వేసే నాయకులే ఉండరు కదా..?