ఇటీవల జరిగిన మహారాష్ట్ర రాజకీయాన్ని ఎవరూ మరువలేరంటే అతిశయోక్తి కాదేమో. శివసేన, బి.జె.పి హై డ్రామా సినిమాలను తలపించింది. అయితే వారు మరోసారి వార్తల్లో నిలిచే అవకాశం కనిపిస్తోంది. శివసేనను దూరం చేసుకుని ఏకంగా సీఎం కుర్చీనే కోల్పోయిన బీజేపీ, మరలా.. పాత స్నేహాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్లు ఇక్కడ తెలుస్తోంది. దానికి కొద్ది సేపటి క్రితం జరిగిన సంఘటనే కారణం. శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆశ ఇంకా బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. 

 

ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కోరితే, వారితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకుడు సుధీర్‌ మునగంటివార్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం ఇపుడు రాజకీయాల్లో హాట్ టాపిక్. శుక్రవారం నాందేడ్‌ పర్యటనలో ఉన్న ఆయన రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ, శివసేన ఎప్పటికీ, తమ మిత్రపక్షమేనని, ఇద్దరి సిద్దాంతాలూ ఒకటేనన్నారు. శివసేన నుంచి ప్రస్తావన వచ్చినట్టయితే తాము ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 

 

శివసేనకు కాంగ్రెస్‌ మద్దతు పలుకడమనేది 21వ శతాబ్దాంలోని ఒక విచిత్ర చర్యగా సుధీర్‌ మునగంటివార్‌ అభివర్ణించారు. కాంగ్రెస్‌ నేత అశోక్‌ చవాన్‌ పేర్కొన్నట్టుగానే బీజేపీని అధికారం నుంచి దూరం చేసేందుకే కాంగ్రెస్‌ శివసేనకు మద్దతు పలికిందని విమర్శించారు. అయితే దీనివల్ల శక్తివంతమైన ముంబైలోని మాతోశ్రీ ప్రాబల్యం కొంతమేర తగ్గిందని మరోవైపు ఢిల్లీ మాతోశ్రీ బలం పెరిగిందంటూ సుధీర్‌ మునగంటివార్‌ శివసేనకు చురకలంటించారు.

 

ఎన్నికలకు ముందు కలిసి పోటీ చేసి పూర్తి మెజార్టీ సాధించిన శివసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి పీఠం విషయంపై విబేధాల కారణంగా బీజేపీతో కాకుండా కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో ఏర్పాటైన ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సుధీర్‌ మునగంటివార్‌ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని పలువురు రాజకీయ ప్రముఖుల విశ్లేషణ.

మరింత సమాచారం తెలుసుకోండి: