ఈ ఏప్రిల్ నెల నుంచి ప్రజలకు జగన్ సర్కారు కొత్త సర్ ప్రైజ్ ఇవ్వబోతోంది. ప్రస్తుతం ఇప్పుడు ఇస్తున్న రేషన్ బియ్యాన్ని ఇకపై చక్కగా ప్యాక్ చేసి మరీ ప్రజలకు అందించబోతున్నారు. ఏప్రిల్ 1వ తేదీన అన్ని జిల్లాల్లో నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. అదే విధంగా ఏప్రిల్ నుంచి జిల్లాకో నియోజకవర్గం చొప్పున ప్యాక్ చేసిన నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలన్నారు.
ఇందు కోసం ఇప్పటికే 30 చోట్ల 99 నాణ్యమైన బియ్యం ప్యాకింగ్ యూనిట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ప్యాకేజింగ్ యూనిట్లలో 41 సివిల్ సప్లయ్ శాఖవి కాగా.. మరో 58 చోట్ల పీపీపీ మోడల్లో ప్యాకేజ్డ్ యూనిట్లు ఏర్పాటు చేసింది. ప్రతి 30 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో ఒక ప్యాకేజీ యూనిట్ ఉండేలా జగన్ సర్కారు చర్యలు తీసుకుంటోంది. మొత్తం మీద... నెలకు 2 వేల టన్నుల బియ్యాన్ని ప్యాకేజీ చేసే సామర్థ్యం, సత్వర పంపిణీ కోసం సిబ్బంది, వాహనాలను ప్రభుత్వం ముందుగానే గుర్తించింది.
అంతే కాదు.. ఈ బియ్యం సంచులతో పర్యావరణానికి హాని జరగకుండా బియ్యాన్ని ప్యాకేజీ చేసేందుకు వాడుతున్న సంచులను తిరిగి సేకరించేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా సీఎం జగన్ నిర్వహించిన పౌరసరఫరాల శాఖ సమావేశంలో జిల్లాల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన బియ్యం, నిల్వల వివరాలను సీఎం వైయస్ జగన్కు అధికారులు వివరించారు.
నాణ్యమైన బియ్యం సరఫరాకు 26.63 లక్షల టన్నులు అవసరమని, ఖరీఫ్, రబీ సీజన్లలో పంట ద్వారా 28.74 లక్షల టన్నుల బియ్యం అందుబాటులో ఉందని సీఎంకు వివరించారు.అదే విధంగా శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, వైయస్ఆర్ జిల్లాల్లో సేకరించిన నాణ్యమైన బియ్యం నమూనాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ పరిశీలించారు.