మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగి ఓ వ్యక్తి చనిపోయిన సంఘటన శుక్రవారం అమరావతిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... అమరావతి ప్రాంత పరిధిలోని వెంకటపాలెం గ్రామానికి చెందిన పులి హరి బాబు చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇక అనారోగ్యాన్ని భరించలేను. అనుకున్న అతను ఆత్మహత్య చేసుకుందామని హరిబాబు మద్యం లో పురుగుల మందు కలుపుకుని తాగేందుకు నిర్ణయించుకున్నాడు. మద్యం, పురుగుల మందు తెచ్చుకుని రెండింటినీ కలిపి తాగుతున్నాడు.


ఇంతలో హరిబాబుకు పరిచయం ఉన్న దాసరి వందనం అటువైపు వచ్చాడు. మద్యం తాగుతున్న హరి బాబును చూసి తనకూ పోయాలని అడిగాడు. అందుకు హరిబాబు నిరాకరించడంతో వందనంలో పంతం మరింత పెరిగింది. మద్యం పోయాల్సిందేనని పట్టుబట్టడంతో అసలు విషయం చెప్పేశాడు హరిబాబు. మద్యం పురుగుల మందు కలిపేశానని చెప్పాడు. అయితే తనకు మద్యం పోయాల్సి వస్తుందని అబద్ధం చెబుతున్నాడని భావించిన వందనం.. హరిబాబు మాటలు నమ్మలేదు.


మద్యం పోయాల్సి వస్తుందనే సాకులు చెబుతున్నాడని భావించిన వందనం.. తనే స్వయంగా గ్లాసులో పోసుకుని తాగేశాడు. అందులో నిజంగానే పురుగుల మందు కలిపి ఉండడంతో కొద్దిసేపటికే ఇద్దరూ మృతి చెందినట్లు తెలుస్తోంది. హరిబాబు, వందనం విగత జీవులుగా పడి ఉండడాన్ని గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.


పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి.. మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగడం పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హరిబాబు అంతుపట్టని వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసిందని.. అందుకే ఆత్మహత్య చేసుకున్నాడా? లేక మరేమైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అలాగే వందనం వయస్సు 75 సంవత్సరాలకు పైబడి ఉందని.. మద్యంలో పురుగుల మందు కారణంగా చనిపోయాడా? లేదా వయస్సు పైబడి అకస్మాత్తుగా చనిపోయాడా? అనే విషయాల పై దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. .

 

మరింత సమాచారం తెలుసుకోండి: