కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో పలువురు సభ్యుల బృందం.. బడ్జెట్‌పై భారీ కసరత్తు చేసింది. ఆ సభ్యులు మామూలు వ్యక్తులేం కాదు.. ఒక్కొక్కరు ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉన్నారు. అలాంటి.. టీమ్‌ నిర్మల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

 

2020 బడ్జెట్‌ ప్రవేశపెట్టడం వెనుక కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కృషి దాగుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి తన మార్క్ ఏంటో చూపించింది. అందుకే ఆమె ఉద్ధండులైన సభ్యులనే తన బృందంలో చేర్చుకొని బడ్జెట్ ను రూపొందించారు.  

 

బృందంలో ఒకరైన నిర్మలా సీతారామన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరలేదు. మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక కేంద్ర మంత్రివర్గంలో ఆమె కీలకమైన ఆర్థికశాఖ బాధ్యతలను చేపట్టారు. గతేడాది తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మల ఈ సారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. జేఎన్‌యూ నుంచి మాస్టర్స్‌ పూర్తిచేసిన నిర్మల.. సేల్స్‌ గర్ల్‌ స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగారు. 

 

నిర్మల బృందంలోని మరో కీలకమైన వ్యక్తి ముఖ్య ఆర్థిక సలహాదారు కె. సుబ్రమణియన్.  షికాగో విశ్వవిద్యాలయంలో 'బూత్‌ స్కూల్‌' నుంచి అర్థశాస్త్రంలో పీహెచ్‌డీ చేసిన ఆయన గతేడాది జులైలో తన తొలి ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. కీలక ప్రతిపాదనలు చేశారు. మందగమనం నుంచి ఆర్థిక వ్యవస్థను బయటకు తీసుకొచ్చేందుకు సుబ్రమణియన్‌ కృషి చేస్తున్నారు. 

 

ఆర్థిక సేవల కార్యదర్శిగా ఉన్న రాజీవ్‌ కుమార్ ..నిర్మల బృందంలో మరో సభ్యుడు. గుజరాత్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన రాజీవ్‌.. బ్యాంకింగ్‌ సంస్కరణల్లో ముఖ్య పాత్ర పోషించారు. ఈ బృందంలో ఆయనది గురుతర బాధ్యత. మరో వ్యక్తి రెవెన్యూ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే. ఆధార్‌ విజయానికి పనిచేసిన అతికొద్ది మంది వ్యక్తుల్లో పాండే ఒకరు. ప్రస్తుతం రెవెన్యూ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరో సభ్యుడు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతాను చక్రవర్తి గుజరాత్‌ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. సృజనాత్మక ఆలోచనలతో పెట్టుబడుల ఉపసంహరణను ముందుకు తీసుకెళ్లిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. 

 

కోల్ కతా యూనివర్శిటీ నుంచి అర్థశాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తిచేసిన సోమనాథన్‌... నిర్మల బృందంలో మరో కీలక సభ్యుడిగా ఉన్నారు. గతంలో ప్రపంచ బ్యాంక్‌లో పనిచేశారు. ప్రస్తుతం ఎక్సెపెండీచర్‌ సెక్రటరీగా ఉన్నారు. గతేడాది పెట్టుబడుల ఉపసంహరణ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తుహిన్‌ కాంత పాండే కూడా బడ్జెట్‌ కసరత్తు బృందం సభ్యుడిగా ఉన్నారు. ప్రభుత్వ రంగ ఎయిరిండియా విక్రయ బాధ్యతలు ఈయన పైనే ఉన్నాయి. మొత్తంగా ఇదీ టీమ్‌ నిర్మల‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: