కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం 2020-21 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. నరేంద్రమోదీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్ ఇది. రెండున్నర గంటలకుపైగా బడ్జెట్ ప్రసంగం చేసిన నిర్మల.. గ్రామీణ, వ్యవసాయరంగాలకు పెద్ద పీట వేశారు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పీకల్లోతు ఆర్ధిక కష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే . కేంద్రం కరుణిస్తుంది అని ఆశగా ఎదురు చూసింది. కాని ఈ బడ్జెట్ నిరుత్సాహపరిచినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే వాస్తవానికి 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయినప్పుడు అప్రతిహతమైన మెజారిటీతో విజయం సాధించాడు.
నాడు తొమ్మది సంవత్సరాల పాటు సీఎంగా చేసిన చంద్రబాబును కేవలం 47 అసెంబ్లీ సీట్లతో సరిపెట్టుకునేలా చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రం వచ్చాయి. కాని, వైఎస్కు మాత్రం 2004 ఎన్నికల్లో 33 ఎంపీ సీట్లను సాధించారు. అదే విధంగా 2009 ఎన్నికల్లో కూడా 33 ఎంపీ సీట్లను సొంతం చేసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే.. నాడు యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాలు సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఏర్పడి మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రి అవ్వడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన ఎంపీ సీట్లే చాలా కీలకం అయ్యాయని అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
ఈ క్రమంలోనే 33 ఎంపీ సీట్లు ఇచ్చాను.. మా రాష్ట్రానికి నిధులు కావాలి.. మంత్రి పదవులు కావాలని ఢిల్లీ అధిష్టానంతో ఎంతో ధైర్యంగా పోరాడేవారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. దీంతో సోనియా గాంధీ సైతం వైఎస్ ధైర్యానికి మెచ్చి ఏం అడిగినా వెంటనే మంజూరు చేసేవారు. ఇలా వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న ఆ ఐదేళ్లు ఎంతో చొరవతో ఎన్నో నిధులను ఆంధ్రప్రదేశ్కు అందించారు. అయితే ఆ తర్వాత ముఖ్యమంత్రిగా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి గాని, కె. రోసయ్యగాని, స్టేట్ డివైడ్ అయ్యాక అటు కేసీఆర్గాని, ఇటు జగన్గాని ఆ చొరవ చూపించలేదని స్పష్టంగా అర్థం అవుతోంది.
వైఎస్ లాగా కేంద్రంతో ఢీ అంటే ఢీ అనేలా ఫైట్ చేసి నిధులు తెప్పించుకునే సత్తా ప్రస్తుతం వీళ్లలో కనిపించడం లేదు. ఆ ధైర్యం కేవలం గత కొన్ని దశాబ్దాలుగా చూస్తే ఒక్క వైఎస్లోనే ఉన్నట్టు అనిపిస్తోంది. వైఎస్ హయాంలోనే కేంద్రం నుంచి ఎన్నో నిధులు వచ్చాయి. మరి వీళ్లంతా ఆ తెగువ, చేవలేని సీఎంలుగా మిగిలిపోతారా.. లేదా.. కేంద్రంతో ఫైట్ చేసి తెలుగోడి సత్తా చాటి నిధులు తెప్పించుకుంటారా అన్నది చూడాలి.