2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. లోక్సభలో రెండున్నర గంటలకుపైగా బడ్జెట్ ప్రసంగం చేసిన నిర్మల.. గ్రామీణ, వ్యవసాయరంగాలకు పెద్ద పీట వేశారు. ఆదాయపన్ను చెల్లింపులో పలు మార్పులు తీసుకొచ్చారు. మధ్య, ఎగువతరగతి వర్గాలకు ఊరటనిచ్చేలా వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లలో మార్పులు చేశారు. అయితే ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు చేయలేదు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను కూడా ప్రస్తావించలేదు. ప్రత్యేక హోదా, పోలవరం జాతీయ ప్రాజెక్టుకు నిధులు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్ధిక సాయం లాంటివి ఆర్ధిక మంత్రి ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పీకల్లోతు ఆర్ధిక కష్టాల్లో ఉంది. కేంద్రం కరుణిస్తుంది అని ఆశగా ఎదురు చూసింది. కాని కేంద్రం మాత్రం మొండి చేయ్యి చూపించింది. ఏపీలో రెండు తెలుగు రాష్ట్రాలు విభజన జరిగి ఇంత కాలం అయినా విభజన హామీలు ఇప్పటికీ నెరవేరలేదు. లోటు బడ్జెట్ రాష్ట్రంగా ప్రయాణం ప్రారంభించిన ఏపీ ఇంకా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. అయితే 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆ ఐదేళ్ల కాలంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ఎన్నో నిధులు కేంద్రం నుంచి తీసుకువచ్చారు. ఆ ఎన్నికల్లో 33 ఎంపీలను గెలిచిన వైఎస్ వాళ్లను ఎంతో ప్రోత్సహిస్తూ.. మన రాష్ట్రానికి మరిన్ని నిధులు తీసుకురావాలని వాళ్లకు పదే పదే చెప్పేవాడు.
దీంతో ఆ ఎంపీలు కూడా వైఎస్కు కట్టుబడో లేదా భయపడో పార్లమెంట్లో ఫైట్ చేసి ఎవరి వంతు వాళ్లు చొరవ చూపించి నిధులు తీసుకువచ్చేవారు. కాని.. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. నేడు జరిగిన బడ్జెట్ 2020లో రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగితే.. అటు తెలంగాణ ఎంపీలుగాని.. ఇటు ఆంధ్రప్రదేశ ఎంపీలుగాని మాట్లాడిన పాపానపోలేదు. కేవలం తెలంగాణకు నుంచి టీఆర్ఆర్ఎస్ పార్లమెంట్రీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు ఒక్కరే మాట్లారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. ఏపీకి కేంద్రం మొండిచెయ్యి చూపించిందని ఆరోపించారు.
దీంతో ప్రస్తుతం మిగిలిన ఎంపీలకు తెలుగు రాష్ట్రాల ప్రజల బాధలు పట్టడం లేదా..? తెలుగు ఎంపీలు మరీ ఇంత చావచచ్చినోళ్లుగా అయిపోయారని అనేక రకాలుగా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇక దానికి తగ్గట్టు రెండు తెలుగు రాష్టాలు సీఎంలు.. ఎంపీలకు సరైన వార్నింగ్ ఇచ్చినట్టు ఏ మాత్రం కనిపించడం లేదు. కేంద్రం నిధులు ఇస్తేనే తీసుకుందాం అన్నట్టుగా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు, ఎంపీల వ్యవహారం నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఏదేమైనా క్లారిటీగా చెప్పాలంటే.. వైఎస్ ఆరేళ్ల పాలన తర్వాత ఇక్కడ గొడవలు, లుకలుకలు, రాష్ట్ర విభజన తప్పా అసలు కేంద్రం నుంచి నిధులు అడిగిన వాడు ఆ దమ్ము చూపించేవాడు ఎవ్వరూ లేరని అభిప్రాయపడుతున్నారు కొందరు.