కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రవేశపెట్టిన 2020-21 సార్వత్రిక బడ్జెట్ చాలా మందిని ఆకట్టుకోలేక పోతోంది. ఈ బడ్జెట్పై బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలు, పార్టీల నాయకులు అగ్గిమీద గుగ్గిల మవుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర బడ్జెట్ ఇన్వెస్టర్లను ఆకట్టుకోలేకపోవడంతో సెన్సెక్స్ భారీగా పతనమైంది. నిర్మలా సీతారామన్ అలా కేంద్ర బడ్జెట్ లోక్సభలో ప్రవేశ పెట్టారో లేదో వెంటనే బీఎస్ఈ సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోయి మరోసారి 40 వేల మార్కునకు దిగువన నమోదైంది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా అదే బాటలో పయనించి, అత్యంత కీలకమైన 11,750 మార్కునకు దిగువున నమోదైంది. ఇక ట్రేడింగ్ ముగిసే టైంకు సెన్సెక్స్ 2.59 శాతం నష్టంతో అమాంతం 39668.63 వద్దకు పడిపోయింది. నిఫ్టీ సైతం 246.25 (2.06 శాతం) నష్టపోయి 11715.85 వద్దకు పతనమైంది. నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసిన కారణంగానే స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఇక కొత్త పన్ను విధానం ప్రకటించడంతో పాటు, ఆదాయపు పన్ను చెల్లించే వారికి పాత విధానంతో పాటు కొత్త విధానం కూడా అమల్లోకి వస్తుందని మంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే.
గతంలో పన్ను మినహాయింపుల కోసం ఇన్స్యూరెన్స్ పాలసీల వైపు చెల్లింపుదారులు మొగ్గు చూపే వాళ్లు. ఈ సారి 80(సీ) కింద మినహాయింపులు రద్దు చేయడం.. ఎల్ఐసీలో వాటాల విక్రయం ఇన్స్యూరెన్స్ కంపెనీల షేర్లు పతనం అవడానికి కారణమయ్యాయి. ఇన్వెస్టర్లు తీవ్ర ఒత్తిడికి గురవ్వడంతో పాటు షేర్లు అమ్మేందుకు ప్రయత్నించడంతో సెన్సెక్స్ 1073 పాయింట్లు నష్టపోయి 39,649 వద్ద, నిఫ్టీ 319 పాయింట్ల నష్టంతో 11642 పాయింట్ల వద్ద ముగిసింది.
భారత స్టాక్ మార్కెట్లు సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పని చేస్తాయి. అయితే ఈ సారి కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెడుతోన్న నేపథ్యంలో శనివారం కూడా మార్కెట్లు తెరిచారు. చాలా మంది ఇన్వెస్టర్లు, స్టాక్ బ్రోకర్లు బడ్జెట్ వల్ల మార్కెట్లు లాభాలను అర్జిస్తాయని తెరిస్తే.. చివరకు అత్యంత నష్టాలను మూటగట్టుకోవడం మార్కెట్ వర్గాలను నివ్వెరపరిచింది. ఏదేమైనా బడ్జెట్ ఎఫెక్ట్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించింది.