జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏపీలో యాక్ట్ పాలిటిక్స్ లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటి వరకు అమరావతిలో రాజధాని రైతులకు మద్దతుగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న అయన ఆ తరువాత బీజేపీతో పొత్తు పొత్తు పెట్టుకున్నారు. ఇక అప్పటి నుంచి ఢిల్లీలోనే ఎక్కువ సమయం గడుపుతూ వస్తున్నారు. ఇక బీజేపీతో పొత్తు పెట్టుకున్న తరువాత తొలిసారిగా ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా అనేక వ్యవహారాలకు సంబంధించి ఆయన క్లారిటీ ఇవ్వడంతో పాటు సంచలన వ్యాఖ్యలు చేశారు.
సమావేశం మధ్యలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు సంబంధించిన టాపిక్ రాగా .. ఆయన పార్టీలో ఉన్నారో లేదో తనకు తెలియదని, ఎవరు పార్టీలో ఉంటున్నారో ఎవరు వెళ్లిపోతున్నారో తెలుసుకునేందుకు నేను కాపలా కాసుకునే రాజకీయాలు చేయడం లేదంటూ మండిపడ్డారు. ప్రజా ప్రయోజనాలు, సమాజ శ్రేయస్సు కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ అన్నారు. భావజాలం ఉన్న వ్యక్తులు అయితే పార్టీ కోసం తన వెంట ఉండే వారిని, అలా లేని వారు వెళ్ళిపోతారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో మాత్రం మనల్ని ఇష్టపడే వ్యక్తులు మాత్రమే ఎమ్మెల్యేలు అవుతారు అంటూ పవన్ చెప్పారు.
అధికారం కోసం అడ్డదారులు తొక్కి, ఎవరి మోచేతి నీళ్లు తాగేందుకు తాను సిద్ధంగా లేను అంటూ పవన్ వ్యాఖ్యానించారు. పార్టీ విధానాలు, తన విధానాలు నచ్చిన వారు మాత్రమే ఉండవచ్చని, ఇష్టం లేని వాళ్ళు నిర్మొహమాటంగా వెళ్లిపోవచ్చంటూ పవన్ అన్నారు. కొంతమంది పార్టీ నుంచి వెళ్ళి పోతూ తనపైనా, జనసేనపైనా బురదజల్లే కార్యక్రమం పెట్టుకున్నారని ఆయన ఘాటుగా స్పందించారు. బలవంతంగా ఎవరు జనసేనలో ఉండాల్సిన అవసరం లేదని, ఆయన రాపాక వరప్రసాద్, జేడీ లక్ష్మీనారాయణలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సినిమాల్లో నటిస్తున్నానని కొంతమంది కామెంట్ చేస్తున్నారని, తాను మాత్రం తనపై ఆధారపడిన వారి కోసమే సినిమాలు చేస్తున్నానని చెప్పారు. నెలకు కోటి రూపాయల ఆదాయం, వేల కోట్ల ఆస్తి ఉంటే తాను సినిమాలు చేయాల్సిన అవసరం ఎందుకుంటుంది అంటూ ఈ సందర్భంగా పవన్ ప్రశ్నించారు.