కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21కి సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో ఐపీవో ద్వారా ప్రభుత్వరంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ)లో వాటాలను విక్రయించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎల్ఐసీలో వాటాల అమ్మకంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ ఈ మేరకు కీలక వివరాలు వెల్లడించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశం ఉన్నట్లు ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ వెల్లడించారు.
ఎల్ఐసీ ఐపీఓ లిస్టింగ్కు సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ మార్గదర్శకాలను అనుసరిస్తామని ఆర్థిక శాఖ కార్యదర్శి తెలిపారు. ఇందుకోసం చట్టసవరణ అవసరమవుతుందని, ఇందుకు సంబంధించి న్యాయ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపనున్నట్లు కుమార్ వెల్లడించారు. లిస్టింగ్ మాత్రం ఈ ఏడాది సెప్టెంబర్ తర్వాతనే జరుగనుందని చెప్పారు. ఎల్ఐసీలో వాటా విక్రయం అంతా పారదర్శకంగా జరుగనుందని, ప్రతి ఒక్కరు కొనుగోలు చేసే విధంగా మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుమార్ వెల్లడించారు. ఎల్ఐసీలో ఎంతమేర వాటా విక్రయిస్తారు అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ... పది శాతం ఉంటుందని అనుకుంటానని, ఇప్పటికైతే ఏ నిర్ణయం తీసుకోలేదని స్పష్టంచేశారు.
60 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఎల్ఐసీకి బీమా రంగంలో 70 శాతానికి పైగా వాటా కలిగి ఉంది. పాలసీల విక్రయాల్లో 76.28 శాతం, తొలి ఏడాది ప్రీమియం వసూళ్లలో 71 శాతం వాటా ఉంది. అయితే, ఆర్థిక మాంధ్యంతో ఎల్ఐసీలో వాటా విక్రయం ద్వారా రూ.90 వేల కోట్ల నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం..ఐడీబీఐ బ్యాంకుతోపాటు ఇతర సంస్థల్లో వాటాలను అమ్మడం ద్వారా రూ.2.10 లక్షల కోట్లు లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుతం ఎల్ఐసీలో ప్రభుత్వానికి 100 శాతం వాటా ఉండగా, అదే ఐడీబీఐ బ్యాంకులో 46.5 శాతం వాటా ఉంది.