తెలంగాణాలో జరిగే అతిపెద్ద, విశిష్ట గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మల జాతర. మన దేశంలో.. ఆ మాటకి వస్తే.. ఆసియాఖండంలోనే అతిపెద్ద జాతర సమ్మక్క-సారక్క జాతర. ఇక మేడారం మహాజాతర 2020,ఫిబ్రవరి 5వతేదీన ప్రారంభం అవుతుంది. 5 న సారలమ్మ గద్దెపైకి రానుంది. 6న సమ్మక్క గద్దెమీదకి వస్తున్నది. 7న భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు. 8న సమ్మక్క, సారలమ్మ వన ప్రవేశం చేయడం వంటి మహా ఘట్టాలు నిర్వహించనున్నారు. ఈ జాతరకు తెలంగాణా నుండే కాకుండా మధ్య ప్రదేశ్, చెత్తిస్ ఘడ్, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాలనుండి సుమారు కోటికి పైగా భక్త జనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు.
1996 లో ఈ జాతరను ఆంధ్ర ప్రదేశ్,ప్రభుత్వము రాష్ట్ర పండుగగా గుర్తించింది. ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. అలాగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రతీ రెండేళ్లకోసారి కొనసాగుతుంది. అయితే, జాతర జాతరకు అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నాడు అభయారణ్యంలోని కుగ్రామంలో ఆదివాసీలే కొలిచే అమ్మవార్లను దర్శించుకోవడానికి నేడు ఖండాంతరాలు దాటుకుని భక్తులు తరలివస్తున్నారు. నాడు ఆదివాసీలకే దేవతలుగా ఉన్నసమ్మక్క-సారలమ్మ నేడు అన్నివర్గాల దేవతలుగా పూజలు అందుకుంటున్నారు.
ఇక జాతర ప్రభుత్వ పరిధిలోకి వచ్చిన తర్వాత అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆ ప్రాంతం రూపురేఖలు మారిపోయాయి. సౌకర్యాలు మెరుగయ్యాయి. ఆధునిక జాతరగా మేడారం రూపాంతరం చెందుతోంది. కాగా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వం మేడారం జాతరపై ప్రత్యేక దృష్టి సారించింది. కోట్లాది మంది భక్తుల కోసం సౌకర్యాలు, అనేక ఏర్పాట్లు చేస్తోంది. జాతర సమయంలో భక్తుల కోసం తాగునీరు, వైద్యం, విద్యుత్, రవాణా, సౌకర్యాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఈసారి మహా జాతరకు సీఎం కేసీఆర్ రూ. 75 కోట్లు కేటాయించారు. దీంతో జాతర అభివృద్ధి పనులను తుదిదశకు చేరుకున్నాయి.