మొత్తం దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రఖ్యాతులు గాంచినటువంటి.. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని టీఆర్‌ఎస్ పార్టీ కోరింది. రాజ్యసభలో మంగళవారం (ఫిబ్రవరి 4) టీఆర్‌ఎస్ ఎంపీ బండా ప్రకాశ్‌ మాట్లాడుతూ.. మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మేడారం జాతరను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహిస్తోందని ఈ సందర్భంగా ఎంపీ పార్లమెంటులో ప్రస్తావించారు. 

 

అతను మాట్లాడుతూ.. ‘మేడారం జాతర అతిపెద్ద గిరిజన జాతర. ఈ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాల నుంచి కోట్లాది భక్తులు తరలివస్తారు. పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు కూడా సమ్మక్క, సారలమ్మను దర్శించుకుంటారు. సంప్రదాయబద్ధంగా జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరను మరింతగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది’ అని ఎంపీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

 

గిరిజనుల జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారంలో ట్రైబల్‌ మ్యూజియం కూడా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ బండా ప్రకాశ్ కోరడం జరిగింది. మేడారం అభివృద్ధి కోసం కేంద్రం రూ. 1000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అయితే.. మేడారానికి జాతీయ హోదా కోసం టీఆర్‌ఎస్ పార్టీ గత కొన్నేళ్లుగా పార్లమెంట్‌లో డిమాండ్ చేస్తోంది. దీనిపై కేంద్రం ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు.. మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. 

 

జాతరకు సర్వత్రా సంసిద్ధమైంది. జంపన్నవాగు జనసంద్రంగా మారింది. అమ్మవార్ల గద్దెల వద్ద భక్తులు కిక్కిరిసిపోయారు. బుధవారం (ఫిబ్రవరి 5) సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపైకి చేరడంతో మహా జాతర ప్రారంభమవుతుంది. గురువారం సమ్మక్క తల్లి గద్దెలపై కొలువుతీరుతుంది. ఫిబ్రవరి 5, 6, 7, 8 తేదీల్లో ప్రధాన జాతర జరుగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా ఫిబ్రవరి 7న సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్కించుకోనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: