తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మేడారం జాతరలో అపశృతి చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలం సుబ్బారావుపేటకు చెందిన వినోద్, సికింద్రాబాద్ కు చెందిన వినయ్ జంపన్నవాగులో స్నానం చేస్తున్న సమయంలో ఫిట్స్ రావడంతో మృతి చెందారు. ఫిట్స్ రావడంతో నీటిలో మునిగిపోయి వినయ్, వినోద్ లు మృతి చెందారు. వైద్య శాఖ అధికారులు ఈ ఘటనతో అప్రమత్తమయ్యారు. 
 
జంపన్న వాగులో స్నానం చేస్తున్న సమయంలో భక్తులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గోతులు, సుడిగుండాలు వాగులో అక్కడక్కడా ఉండే అవకాశం ఉందని భక్తులను జాగ్రత్తలు చెబుతున్నారు. జాతరకు వెళ్లే భక్తులు చిన్నపిల్లలను కనిపెట్టుకొని ఉండటంతో పాటు మహిళలు, వృద్ధులు జంపన్న వాగులోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. వైద్యులు కూడా జాతరలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నారు. 
 
వైద్యులు భక్తులకు లౌడ్ స్పీకర్ల ద్వారా తగిన సూచనలు చేస్తున్నారు. ప్రపంచంలోనే జరిగే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం జాతరకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ నెల 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు మేడారం మహా జాతర జరగనుంది. సీఎం కేసీఆర్ ఇప్పటికే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తొలిరోజున గోవిందరాజు, పడిగిద్దరాజు, సారలమ్మ గద్దెలకు చేరుకుంటారు.   

 

జాతర ప్రారంభానికి ముందే అపశృతి చోటు చేసుకోవటంతో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపడుతున్నారు. మేడారం వస్తున్న భక్తులు ఎవరైనా అనారోగ్య సమస్యలు ఉంటే శిబిరాలకు చేరుకోవాలని సూచనలు చేస్తున్నారు. ఈ నెల 8వ తేదీన దేవతామూర్తులు వన ప్రవేశం చేయడంతో ఈ జాతర ముగియనుంది.                             

మరింత సమాచారం తెలుసుకోండి: