వైసీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ...రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నవారిలో ఒకరు. పార్టీ మారినా, ప్లేస్ మారినా రాజకీయాల్లో రోజా దూకుడు మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. చంద్రబాబు ఆమెను చంద్రగిరి టు నగరి ఇలా తిప్పి తిప్పి ఓడించినా రోజా రాజకీయంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా ఆ తర్వాత వైసీపీలోకి జంప్ చేసి నగరి నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. స్వతహాగా రోజాకు ఉన్న బలం ఆమె వాయిస్. ప్రత్యర్థులపై పటా పట్ పంచ్లతో ఆమె విరుచుకు పడే తీరే ఆమెను ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సామాన్యులకు సైతం దగ్గర చేసింది.
అందుకే ఎంతో మంది రాజకీయంగా ముఫ్పై, నలభై ఇండస్ట్రీ మాది అని చెప్పుకునే వారికి సైతం రాని క్రేజ్ ఈ రోజు ఆమె సొంతం. టీడీపీలో ఉన్నప్పుడు వరుసగా రెండుసార్లు ఓడినా.. వైసీపీలో ఆమె గెలిచి జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాకపోవడంతో ఆమెను అందరూ ఐరెన్లెగ్ అన్నా ఆమె అంతే పట్టుదలతో పోరాటం చేసి నగరిలో వరుసగా రెండోసారి విజయం సాధించడంతో పాటు తాను గోల్డెన్లెగ్నే కాని.. ఐరెన్లెగ్ను కాదని ఫ్రూవ్ చేసుకుంది.
మహిళా కోటాలో ఆమెకున్న ఛరిష్మాతో సహజంగానే మంత్రి పదవి దక్కాలి. అయితే ఆమెకు మంత్రి పదవి
వస్తే అదే జిల్లాలో సీనియర్ల మాట నెగ్గుతుందా ? అసలు వాళ్లను పట్టించుకుంటారా ? వాళ్ల మాట అధికారులు వింటారా ? ఖచ్చితంగా వినరు.. అయితే వాళ్లంతా పార్టీ కోసమో లేదా ఇతరత్రా పనుల నేపథ్యంలోనో భారీగా పెట్టుబడులు పెట్టిన వాళ్లు.. జగన్ అవసరాలు, ప్రయార్టీలు ఆయనకు ఉంటాయ్.. అవే ఒత్తిళ్లు ఈ రోజు రోజాకు మంత్రి పదవి రాకపోవడానిక ప్రధాన కారణాలు.
అందుకే రోజా ఈ విషయంపై ఎప్పుడూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. అప్పట్లో టీడీపీ ఉన్నప్పుడు ..నా ఓటమికి కారణం సొంత పార్టీ నేతలే కారణం అని చెప్పిన ఆమె ఇప్పుడు వైసీపీలోనూ అదే పరిస్థితి ఎదుర్కొంటున్నానని వాపోతున్నారు. ఇక రోజా పేరు చెప్పకపోయినా చిత్తూరు జిల్లాకే చెందిన మంత్రి పెద్దరెడ్డి రామచంద్రా రెడ్డి తో రోజాకు విభేదాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో ఆయన తనను ఓడించాలని ప్రయత్నించినట్లు కూడా ఆమె వాపోతున్నారు. మరి ఈ వివాదం ఎప్పటకి ఫుల్స్టాప్ పడుతుందో ? జగన్ ఏం చేస్తారో ? చూడాలి.