మహారాష్ట్రలో పట్టపగలే దారుణం జరిగింది. ప్రేమించడం లేదనే అక్కసుతో ఓ దుండగుడు.. మహిళా లెక్చరర్‌పై పెట్రోల్‌పోసి నిప్పంటించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.

 

మహారాష్ట్రలో ప్రేమోన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. పెళ్లై భార్యాపిల్లలున్న ఓ కామాంధుడు.. మరో మహిళపై ప్రేమపేరిట కామాపేక్ష పెంచుకున్నాడు. ఒప్పుకోనందుకు పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆ మహిళా లెక్చరర్‌.. ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. వార్దాజిల్లా నందోరి చౌక్‌లో నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. 

 

దడోరా గ్రామానికి చెందిన అంకితకు, అదే గ్రామానికి చెందిన వికేశ్‌తో పరిచయం ఉంది. భార్య, ఏడు నెలల కొడుకు ఉన్న వికేశ్‌.. కాలేజ్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్న అంకితను ప్రేమపేరుతో వెంబడిస్తూ వేధించేవాడు. అతడి ప్రవర్తన నచ్చక దూరంగానే పెట్టిందామె. అయితే, ఉదయం కళాశాల దగ్గర కాపుకాసిన వికేశ్‌.. అంకితతో ఘర్షణకు దిగాడు. తన వెంట తెచ్చిన పెట్రోలును ఆమెపై చల్లి నిప్పంటించి.. బైక్‌ మీద పరారయ్యాడు. గాయపడిన అంకితను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో నిందితుడికి మరో ఇద్దరు సహకరించినట్లు తెలుస్తోంది. 

 

మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. దీనిపై సత్వరం విచారణ చేపడతామని ప్రకటించింది. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ విఫలం కావడంతోనే వికేశ్‌ ఈ దాడికి పాల్పడి ఉంటాడని పోలీసులు చెప్పారు. పెళ్లయినా అతడు వేధింపులు మానలేదని, గత ఏడాది ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాడని వివరించారు. వికేశ్‌ కారణంగానే గతేడాది అంకిత వివాహ జీవితం విచ్ఛిన్నమైనట్టు తెలిసింది. మొత్తానికి  ఓ ప్రేమోన్మాది చేతిలో ఓ అమాయకురాలు బలైపోయింది. ప్రాణాలతో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని  స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడిని ఉరితీయాలంటూ గళం వినిపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: