ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లు తెచ్చుకోవడానికి ప్రజలను రెచ్చగొట్టే వ్యూహాన్ని ఎంచుకున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇటు ప్రచారం...అటు సోషల్ మీడియా ద్వారా కూడా ఢిల్లీ ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమం సాగుతోంది. ఒక నాయకుడు ఈ ఎన్నికలను భారత్కు పాకిస్థాన్కు మధ్య సాగుతున్న పోరాటంగా చిత్రీకరించారు. నిరసనకారులను పాకిస్థాన్ ఏజెంట్లుగా పేర్కొనడం, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రీవాల్ను వారితో జతకట్టడం ఈ ప్రచారం లక్ష్యం. కేజ్రీవాల్ (బొమ్మ) మెడలో పుర్రెల మాల వేయడం, బస్సుల దగ్ధమవుతున్న దృశ్యాలు మొదలైనవన్నీ మొత్తం గా గమనిస్తే సమాజాన్ని మత ప్రాతిపదికన విభజించి, ఒక వర్గం ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమం సాగుతుందని తెలిసిపోతుంది.
ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా, కేంద్ర ఆర్థిక సహాయమంత్రి అయిన అనురాగ్ ఠాకూర్ ఈ నెల 27వ తేదీన ఢిల్లీలోని ఒకసభలో అనుచరులను ఉద్దేశించి ‘దేశ్కే గద్దారోంకో, గోలీ మారో...’ అనే అసభ్యకరమైన నినాదాలు ఇచ్చారు. బీజేపీకి చెందిన ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో- ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారి పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘అక్కడ (షహీన్ భాగ్లో) లక్షలమంది వచ్చి చేరారు. ఢిల్లీ ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలె. వారు మీ ఇండ్లలోకి వచ్చి మీ అక్కా చెల్లెండ్లపై, బిడ్డలపై లైంగికదాడి చేసి హత్య చేస్తారు’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారానికి వస్తే గంట సేపట్లో నిరసనకారులను లేకుండా చేస్తామని అన్నారు. తాము అధికారానికి వస్తే నెల రోజుల్లో తమ నియోజకవర్గంలోని ప్రభుత్వ భూమిలో ఉన్న ఒక మసీదుకు చెందిన ప్రార్థనాలయాలను అన్నింటినీ కూల్చివేస్తామని కూడా ఆయన అన్నారు. ‘కశ్మీర్లో మంటలంటుకున్నాయి. అక్కడ తల్లులు, అక్కా చెల్లెండ్లమీద లైంగిక దాడి జరిగింది. కేరళలో, ఉత్తరప్రదేశ్లో, హైదరాబాద్లో కూడా ఇదే జరిగింది’ అంటూ ఆయన మాట్లాడిన తీరు దిగ్భ్రాంతికరంగా ఉంది.
హోం మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో షహీన్ భాగ్ నిరసనలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆయన ప్రసంగానికి ముందే కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అభ్యంతరకరమైన నినాదాలు ఇచ్చారు. అదే సభలో ఆయన చప్ప ట్లు చరుస్తూ నినాదాలివ్వడం, మిగతా నాయకులు కూడా అక్కడ ఉండటం గమనార్హం. నిర్మాణాత్మక పద్ధతిలో ప్రచారం సాగించడం వల్ల ఉద్రిక్తతలకు తావుండదు. ప్రజల సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అంతేకానీ ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం ద్వారా గెలువాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్యవ్యవస్థకే ప్రమాదకరం.