రవాణాశాఖ వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకనుండి ఆన్ లైన్ ద్వారానే అన్ని సేవలను అందించేలా రవాణాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం కూడా రవాణా శాఖలో పారదర్శకతను తెచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తోంది. అధికారులు ఇప్పటికే ఆన్ లైన్ ద్వారానే ఫ్యాన్సీ నంబర్ల బిడ్డింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రవాణాశాఖ అధికారులు వాహనదారులు ఇంటినుండే లర్నింగ్ లైసెన్సులు పొందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
ఈ నూతన విధానాన్ని అందుబాటులోకి తీసుకొనిరావడం ద్వారా దళారీ దందాకు అడ్డుకట్ట వేయాలని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా లర్నింగ్ లైసెన్స్ పొందాలనుకునేవారు ఆర్టీఏ కార్యాలయంలో స్లాట్ బుక్ చేసుకొని కేటాయించిన సమయానికి పరీక్షకు వెళ్లి 20 మార్కులకు 12 మార్కులను సాధిస్తే మాత్రమే లైసెన్సులు జారీ అవుతాయి. ఆ తరువాత ఆరు నెలలలో డ్రైవింగ్ టెస్ట్ పెట్టి నిర్ణీత కాలానికి లైసెన్స్ లను అందజేస్తారు. 
 
లర్నింగ్ లైసెన్సుల జారీ విషయంలో వాహనదారుల నుండి చాలా ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి. సిబ్బంది, దళారులు కలిసి వాహనదారుల నుండి లర్నింగ్ లైసెన్స్ ల జారీ కోసం డబ్బులు వసూలు చేస్తున్నారని బహిరంగంగానే వాహనదారుల నుండి విమర్శలు వ్యక్తమవుతూ ఉంటాయి. చాలా ప్రాంతాలలో దళారుల ద్వారా పరీక్షకు హాజరైన వారు మాత్రమే ఉత్తీర్ణులు అవుతారని మిగతావారు ఉత్తీర్ణులు కారని ఆరోపణలు ఉన్నాయి. 
 
నూతన విధానంలో రవాణాశాఖ వెబ్ సైట్ లోకి వెళ్లి ఎల్.ఎల్.ఆర్ ధరఖాస్తు లింక్ ను ఓపెన్ చేసి వివరాలను నింపి ఫీజు చెల్లిస్తే వెంటనే కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ పై పరీక్ష పత్రం కనిపిస్తుంది. పది నిమిషాలలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. సమయం పూర్తయితే ఆటోమేటిక్ గా సైట్ మూతపడుతుంది. ఈ విధానం ద్వారా పక్కాగా పరీక్షకు సిద్ధమైన వారు మాత్రమే ఉత్తీర్ణులు అయ్యే అవకాశం ఉంది. మరో నెల రోజులలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: