సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైద్య, ఆరోగ్య, విద్య రంగాలపై ప్రధానంగా దృష్టి సారించారు. అమ్మఒడి, నాడు- నేడు వంటి కార్యక్రమాలతో పాఠశాలల తలరాతలు మార్చేస్తున్నారు. అంతే కాదు.. ఆరోగ్య శ్రీ పథకంలోకి అనేక కొత్త రోగాలు చేర్చారు. ఎందరో అభాగ్యులకు వైద్య సౌకర్యం కల్పించారు. ఇప్పుడు వైద్యం పరంగా మరిన్ని కొత్త నిర్ణయాలు తీసుకున్నారు.
వైద్యం పరంగా రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా ఏర్పాటు చేసుకుని సూపర్ స్పెషాలిటీ కోర్సుల ఏర్పాటుపై దృష్టిపెట్టాలని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆస్పత్రుల్లో నాడు – నేడు, సబ్ సెంటర్ల నిర్మాణం, కంటి వెలుగు, ఆరోగ్యశ్రీ, హెల్త్కార్డుల జారీపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. కర్నూలు –కడప –అనంతపురం, ప్రకాశం –నెల్లూరు – చిత్తూరు, కృష్ణా –గుంటూరు, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జోన్లవారీగా సంబంధిత కాలేజీల్లో సూపర్స్పెషాల్టీ కోర్సులపై దృష్టిపెట్టాలని సీఎం సూచించారు.
ఈ జోన్లను నిరంతరం పర్యవేక్షించేందుకు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకూ మూడు మెడికల్ యూనివర్శిటీల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ఈ ఏడాది మే నెల నాటికి వైద్యారోగ్యశాఖలో సిబ్బందిని రిక్రూట్ చేసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ నుంచి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డబ్ల్యూహెచ్ఓ, గుడ్ మానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ ప్రమాణాలతో కూడిన మందులు పంపిణీకి చేయాలని జగన్ అధికారులకు ఆదేశించారు.
ఇవే కాకుండా మరిన్ని లక్ష్యాలని జగన్ అధికారులకు నిర్ణయించారు. వీటి ప్రకారం 1,138 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 52 ఏరియా ఆస్పత్రులు, 169 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో అభివృద్ధి పనులు, కొన్నిచోట్ల కొత్తగా నిర్మాణాలు చేపట్టనున్నారు. 11 మెడికల్ కాలేజీలు, 6 బోధనాసుపత్రులు, 13 జిల్లా ఆస్పత్రుల్లో నాడు – నేడు కింద పనులు చేపడతారు. కొత్తగా 7 మెడికల్ కాలేజీలలు, 8 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, 1 క్యాన్సర్ ఆస్పత్రి, 7 నర్సింగ్ కాలేజీలు అందుబాటులోకి తెస్తారు.