తెలంగాణ బీజేపీకి మరో ఇరకాటం ఎదురైంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు పోరులో గెలుపుకోసం పసుపు బోర్డును సాధిస్తామంటూ ఓట్లు దండుకున్న బీజేపీ నేతలు ఇప్పుడు ఆ విషయంలో విఫలమైంది. నిజామాబాద్లో మరో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించడం కాషాయ పార్టీ నేతలను ఇరకాటంలో పడేసింది. నిజామాబాద్ ఎంపీ అర్వింద్తో పాటు బీజేపీ నాయకులు సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారికి సర్దిచెప్పుకొనేందుకు కమలనాథులు కష్టపడుతున్నారు.
నిజామాబాద్లో సుగంధద్రవ్యాల బోర్డు రీజినల్ కార్యాలయాన్ని ఏర్పాటుచేయనున్నట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పసుపు, మిరపపంటను దృష్టిలో ఉంచుకొని నిజామాబాద్లో ప్రాంతీ య కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. దీనిపై త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. అయితే, దీనిపై టీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. పసుపు బోర్డు ఏర్పాటుచేసి.. దానిద్వారా మద్దతు ధర చెల్లించి పసుపును కొనుగోలుచేయాలి. ఇది రైతులు చేస్తున్న డిమాండ్ అని స్పైస్ బోర్డు ఎందుకని ప్రశ్నించారు.
``రైతుల కోసం కేంద్రం ఒక్క పసుపుబోర్డు ఏర్పాటు చెయ్యలేదా? ఇదివరకే వరంగల్లో స్పైసెస్ బోర్డు ఆఫీసు ఉంది. ఓ ఇద్దరు ఆఫీసర్లతో నిజామాబాద్లో మరో ఆఫీసు పెడ్తామని కేంద్రం చెప్తోంది. దీంతో లాభమేమీ లేదు. వరంగల్లో ఉన్నా.. నిజామాబాద్లో ఉన్నా ఒకటే. నిజామాబాద్లో ఓ ఆఫీసు పెడితే పసుపు రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు. ఎంపీ అర్వింద్ ఇన్నిరోజులు మాయమాటలు చెప్పి ఇప్పుడు కొత్తనాటకం ఆడుతున్నారు. కేంద్రప్రభుత్వం రైతులకు ఏమైనా మేలు చేయాలంటే వెంటనే పసుపుబోర్డు ఏర్పాటు చేయాలి. మద్ధతు ధర ప్రకటించి కేంద్రమే పసుపును కొనుగోలు చేయాలి. ఇదే రైతులు డిమాండ్ చేస్తోంది.`` అని అన్నారు.