తెలంగాణలో అధికారిక టీఆర్ఎస్ పార్టీలో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి. టీఆర్ఎస్లో అగ్రనేతలను దాటుకొని అనతికాలంలోనే కేటీఆర్ పార్టీలో అత్యున్నత పదవిని దక్కించుకొన్నారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కేటీఆర్ తన పట్టును నిరూపించుకొన్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్.. కల్వకుంట్ల తారక రామారావు.. ఐటీ శాఖామంత్రి.. పురపాలక మంత్రి.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. ఇలా టీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత కేటీఆరే కీలక నాయకుడు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. దీంతో తెలంగాణకు కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ టీఆర్ఎస్ వర్గాల్లో ఎప్పటి నుంచో విసృతంగా ప్రచారం జరుగుతోంది.
కేసీఆర్ కేబినెట్లోని పలువురు మంత్రులు సైతం కేటీఆర్కు ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని అనేకసార్లు వ్యాఖ్యానించారు. ఇలా కేసీఆర్ తర్వాత ఎవరన్న ప్రశ్న వచ్చిన ప్రతిసారీ మరో మాట తడుముకోకుండా, కేటీఆర్ పేరే మారుమోగుతోంది. అయితే తాజా సమాచారం మేరకు.. కేటీఆర్ను సీఎం చేయడానికి ముందు ఆయనను డిప్యూటీ సీఎం చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు త్వరలో ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చిస్తున్నట్లు సమాచారం. కేటీఆర్ కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తున్నారంటూ పార్టీలో జోరుగా చర్చ జరగుతోంది.
మరో నెల రోజుల్లో కేటీఆర్ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశాలున్నాయి. ఇలా ముందు ఉపముఖ్యమంత్రిగా కేటీఆర్ను నియమించి... ముఖ్యమంత్రిగా తన బాధ్యతలన్నింటినీ అనధికారికంగా కేటీఆర్కు అప్పగించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కేటీఆర్ కు సీఎంగా బాధ్యతలు అప్పగించి తాను జాతీయ రాజకీయాల వైపు వెళ్లాలని కేసీఆర్ చూస్తున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. కాగా, 2020 కేటీఆర్కు అత్యంత కీలకమైన సంవత్సరంగా, పార్టీలో పెను మార్పుల సంవత్సరంగా పార్టీలో చర్చ జరిగింది. ఈ కొత్తేడాదిలో మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను విజయవంతంగా నిర్వహించి, కేసీఆర్కు కానుక ఇచ్చారు కేటీఆర్. ఇఫ్పుడు కేటీఆర్కు సైతం కేసీఆర్ గిఫ్ట్ సిద్దం చేశారన్న చర్చ జోరుగా వినిపిస్తోంది.