ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి, వైసీపీ ఫైర్‌బ్రాండ్ నేత‌ అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి , టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు, ఆ పార్టీకి చెందిన‌ మాజీ మంత్రి దేవినేని ఉమ వ్యాఖ్యలపై మంత్రి అనిల్ కుమార్ ఫైర్ అయ్యారు. అదే స‌మ‌యంలో మాజీ మంత్రి, చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్‌పై సైతం ఆయ‌న మండిప‌డ్డారు. పోల‌వ‌రం విష‌యంలో టీడీపీ నేత‌లు త‌ప్పుడు లెక్కలు చెప్తున్నార‌ని ఆరోపించారు. పోల‌వ‌రం ప్రాజెక్టుకు తామే బ్రాండ్ అంబాసిడ‌ర్లం అన్న‌ట్లుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

 


పోల‌వ‌రం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ నేత‌లు...మొదటి మూడేళ్ళలో పోలవరానికి ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ డిమాండ్ చేశారు.  టీడీపీ ఐదేళ్ల హయాంలో చేసిన అభివృద్ధి పని ఒక్కటేనా ఉందా అని ఆయ‌న నిల‌దీశారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు అన్నీ మహానేత రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యమేన‌ని అనిల్ తెలిపారు. ఇరిగేషన్ పనుల్లో పర్సంటేజీల రూపంలో తెలుగుదేశం పార్టీ నేత‌లు డబ్బులు దోచుకున్నారని ఆయ‌న మండిప‌డ్డారు. పోలవరం ప్రాజెక్టులో 30 శాతం ప‌నులు కూడా పూర్తి చెయ్యలేదని ఆయ‌న అన్నారు.

 


2021 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామ‌ని మంత్రి అనిల్ వెల్ల‌డించారు. మాజీ మంత్రి దేవినేని  ఉమా బండారం బయట పడుతుందనే భయంతోనే నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడని ఆయ‌న ఆరోపించారు. ఉత్తర కుమారుడు అనే పాత్ర టీడీపీ నేత‌ లోకేష్‌కు సెట్ అవుతుందని అనిల్ ఎద్దేవా చేశారు. ``ఎవరిని చంపి ఉమా రాజకీయాల్లోకి వచ్చాడో విజయవాడ అంతా తెలుసు.`` అని అనిల్ వ్యాఖ్యానించారు. ``నాలో బెరుకు, భయం లేదు.... మీ నాయకుడిని అడిగితే ఆ విషయం తెలుస్తోంది.`` అంటూ మంత్రి అనిల్ మాజీ మంత్రి దేవినేని ఉమాకు స్ప‌ష్టం చేశారు. దోపిడీకి పేటెంట్ రైట్స్ టీడీపీకి సొంతం అని ఆయ‌న పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి టెండర్లు ఆహ్వానిస్తున్నామ‌ని మంత్రి అనిల్ పేర్కొన్నారు. ఐదేళ్లలో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామ‌ని అనిల్ వెల్ల‌డించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: