స్వామి పరిపూర్ణనంద స్వామి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై కీలక వ్యాఖ్యలు చేసారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని 23 ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేయడం ఓ కుట్రపూరిత చర్య అని స్వామి పరిపూర్ణనంద ఆరోపించారు. హైందవ సంఘాల ఐక్య పోరాట వేదిక మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచేలా ఈ దాడులు ఉన్నాయన్నారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా హిందూ ధర్మంపై దాడి జరిగిందన్నారు. ఇన్ని ప్రాంతాల్లో విగ్రహాల ధ్వంసం ఒక్కడి వల్ల కాదన్న ఆయన.. మరికొంత మందికి ఈ కుట్రలో భాగం ఉందన్నారు. ఈ దాడితో హిందూ సమాజానికి ఒక పెద్ద సవాల్ విసిరారన్నారు. 


తాము సెక్యులర్ అని ప్రభుత్వాలు ప్రకటించుకుంటాయి. కానీ విగ్రహాలను ధ్వంసం చేస్తే ఒక్క నాయకుడు కూడా మాట్లాడటం లేదని పరిపూర్ణానంద ఆరోపించారు. అధికారులు, పోలీసులు ఎక్కడిపోయారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని అనుమనించాల్సిన పరిస్థితి తలెత్తిందన్న ఆయన.. ప్రభుత్వం న్యాయం చేయకపోతే ప్రజలు హర్షించరన్నారు. అన్ని కులాల వారు ధర్మ జాగరణలో పాల్గొంటారన్న పరిపూర్ణానంద.. ప్రతి గడపకు తిరిగి హిందుత్వాన్ని ఏకం చేస్తామన్నారు. హిందువుల సమస్య వైసీపీకి, టీడీపీకి పట్టదా? అని ప్రశ్నించారు. పార్టీలకు అతీతంగా నాయకులంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడం కోసం స్వామీజీలు అందరూ రోడ్డెక్కారన్న పరిపూర్ణానంద.. వకులా మాత గుడి కోసం ఎలా పోరాటం చేశామో.. ఇప్పుడు అలాగే పోరాడుతామన్నారు.


విగ్రహాల ధ్వంసం గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరిగినా అధికారులు స్పందించలేదన్న పరిపూర్ణానంద.. ‘‘ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇతడే దాడి చేశాడు, ఇతడికి మతిస్థిమితం లేదని చెప్పారు. కానీ కేవలం గుడి లోపల ఉన్న విగ్రహాలను ధ్వంసం చేశారు. హైందవ సంఘాల ఐక్య పోరాట వేదిక ద్వారా పోరాడాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వ అధికారులు చేసే విచారణపై మాకు నమ్మకం లేదు. ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలి. ధ్వంసమైన విగ్రహాలను హిందూ ధర్మం ప్రకారం విసర్జన చేసి, కొత్త విగ్రహాలు ప్రతిష్టించాలి. ధ్వంసం చేసిన వారి ఆస్తులు జప్తు చేసి విగ్రహాల పునరుద్ధరణ జరగాలి’’ అని డిమాండ్ చేశారు. 

గడప గడపకు హిందూత్వం అనే నినాదంతో ధర్మ జాగరణకు నిర్ణయం తీసుకున్నామని పరిపూర్ణానంద తెలిపారు. మార్చి 1 నుంచి సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తామన్నారు. వందల సంవత్సరాలు పోరాడితే కానీ రామమందిరం నిర్మాణానికి న్యాయం జరగలేదన్నఆయన.. హిందువులు ఎవరి జోలికి వెళ్లరన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: