గత కొంతకాలంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నల మధ్య ట్విట్టర్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా సీఎం జగన్, విజయసాయిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని చంద్రబాబు నాయుడుతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని ట్విట్టర్లో కామెంట్లు చేశారు. 
 
బుద్దావెంకన్న ట్విట్టర్ ద్వారా విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు వేశారు. వైయస్ జగన్, విజయసాయిరెడ్డి కలిసి మొదలుపెట్టిన మూడు రాజధానుల దందా వెనుక ఉన్న అసలు రహస్యాలు తెలియటంతో అధికారులు పారిపోతున్నారని ముందు అధికారులను ఆపే మార్గం చూడండని అన్నారు. మరో ట్వీట్లో అడ్డమైన పనులు చేసి 16 నెలలు చిప్పకూడు తిన్న నీకు మా రాజకీయ జీవితాలకు తెరపడే రోజులు వచ్చాయి అనేంత ధైర్యం వచ్చిందా...? అని ప్రశ్నించారు. 
 
మీరు అంతవరకూ వచ్చిన తరువాత మేము మాత్రం చూస్తూ ఊరుకుంటామా? మిమ్మల్ని, మీ జగన్ గారిని జైలుకు పంపేందుకు ఏరాట్లు చేస్తున్నామని విజయసాయిరెడ్డిని ఉద్దేశించి బుద్దా వెంకన్న ట్వీట్లు చేశారు. మరో ట్వీట్లో బుద్దా వెంకాన్న పాత తప్పులు, ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో చేస్తున్న భూముల దందా అంతా బయటపడుతోందని మీరు, మీ పరివారం ఊచలు లెక్కపెట్టడం ఖాయమని విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ట్వీట్లు చేశారు. 
 
గతంలో విమర్శలు చేయాలంటే ప్రెస్ మీట్లు పెట్టి బహిరంగంగా విమర్శలు చేసేవారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాను వేదికగా చేసుకొని రాజకీయ నాయకులు విమర్శలు చేసుకుంటున్నారు. కొన్నిసార్లు ఈ విమర్శలు హద్దులు దాటుతూ ఉండటం గమనార్హం. ఒక పార్టీ నేతలు మరో పార్టీ నేతలపై విమర్శలు చేసుకుంటూ ప్రజల ముందు చులకన అవుతున్నారు. బుద్దా వెంకన్న చేసిన ట్వీట్ల గురించి విజయసాయిరెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: