మనదేశంలో వీవీఐపీల కారణంగా ట్రాఫిక్లో జనాలు చాలా ఇబ్బందులు పడుతుంటారు. వారి కోసం సాధారణ జనాల వాహనాలను ఎంతసేపైనా నిలబెట్టేస్తారు. ప్రధాని లాంటి అత్యున్నత వ్యక్తి విషయంలో అది మరింత తీవ్రంగా ఉంటుంది. అందుకే దీనికో సొల్యూషన్ కనిపెట్టారు మోడీ సెక్యూరిటీ వింగ్ అధికారులు.
ప్రధాని నరేంద్ర మోదీ చుట్టూ నిత్యం భారీ భద్రతావలయం ఉంటుంది. సుమారు మూడువేల మంది భద్రతాధికారులు.. ఆయన సెక్యూరిటీని డేగ కళ్లతో పర్యవేక్షిస్తుంటారు. ఇలాంటి వీవీఐపీలు ఎక్కడికైనా వెళ్లేటప్పుడు.. ఆ ప్రభావం రోడ్లమీద వెళ్లే సామాన్యజనంపై పడుతోంది. ప్రధానంగా ఆ సమయంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఇబ్బందులు తప్పట్లేదు.
ఢిల్లీ లాంటి హెవీ ట్రాఫిక్ సమస్య ఉండే నగరంలో.. ప్రధాని బయటికొచ్చిన సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. అందుకే ప్రధాని ఇక నేరుగా పార్లమెంటుకు వెళ్లేలా ఒక సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగానే ఈ సొరంగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ... ప్రాజెక్ట్ డిజైనర్లు చెబుతున్నారు. అధిక సెక్యూరిటీ అవసరమైన ప్రధాని వంటి వ్యక్తులను సాధారణ ట్రాఫిక్ నుంచి వేరుచేసేందుకే ఈ ప్రాజెక్టు చేపట్టామన్నారు. ప్రధాని నివాసం నుంచి పార్లమెంటు వరకు ఓ టన్నెల్ రోడ్డును ఏర్పాటు చేస్తున్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ప్రధాని నివాసాన్ని కూడా సౌత్ బ్లాక్కు మార్చనున్నట్టు తెలుస్తోంది.
మొత్తానికి ప్రధాని వస్తున్న సమయంలో జనాలను మొత్తం రోడ్లపై ఆపివేయడంతో వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. దీంతో ఒక్కసారిగా గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఇది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో జనాల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఓ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని కోసం ఏకంగా సొరంగ మార్గం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.